హుజురాబాద్టౌన్ : మీ కండ్ల ముందు మెదిలే నిరుపేద బిడ్డగా నన్ను ఆధరించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించా లని టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పిలుపు నిచ్చారు. ఆదివారం హుజురాబాద్లోని 19వ వార్డులో ప్రచారంలో పాల్గొనడంతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు ఏర్పాటు చేసిన ఆత్మీయ ఆతిథ్యానికి టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడారు.
కోటీశ్వరుడికి నిరుపేదకు మధ్య జరుగుతున్న ఈ పోటీలో మీ కండ్ల ముందు కదలాడే బిడ్డగా నన్ను ఆధరించి అక్కున చేర్చుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గెల్లు శ్రీనివాసయాదవ్ వేడుకున్నారు. తాను 20 ఏండ్లుగా తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి వందల కేసుల పాలై రాష్ర్ట సాధనలో సీఎం కేసీఆర్ వెంటే ఉన్న బిడ్డగా తనను గుర్తించి ఇచ్చిన టికెట్ కనుక కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.
కేసీఆర్ తను చేసిన ఉద్యమాన్ని పోరాట స్ఫూర్తిని గుర్తించి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జీవితాంతం గుర్తు పెట్టుకొని పార్టీకి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని చెప్పారు. అందరూ గెల్లును భారీ మెజారిటీతో గెలిపించేందుకు గడప గడపకు తిరిగి ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుందని స్థానికులు స్పష్టం చేశారు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజుతో పాటు వార్డు ప్రజలు శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ సోయం రాజు, కరీంనగర్ కార్పొరేటర్ భూమాగౌడ్, సిద్దిపేట కార్పొరేటర్ గూడాల శ్రీకాంత్, టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు గందే సాయిచరణ్, అపరాజ రమాదేవి, జనార్దన్ తదితరులున్నారు.