ఏలూరు : జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు రూ.1.29 కోట్లు ఉండనున్నది. రెండేండ్ల కాలంలో పట్టుకున్న దాదాపు 61 వేల మద్యం బాటిళ్లను పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. ఏలూరులో అక్రమ మద్యం రవాణాకు సంబంధించి జిల్లాలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 1,482 కేసులకు సంబంధించి 61,235 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 8,270 లీటర్ల అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు ధ్వంసం చేశారు.
జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి, కల్తీ మద్యాన్ని పాతిపెట్టారు. ఏలూరు హైవే సమీపంలోని ఏలూరు ఆశ్రమ దవాఖాన వద్ద గల మైదానంలో బాటిళ్లను జేసీబీతో నుజ్జునుజ్జు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జిల్లా ఇంఛార్జి అదనపు ఎస్పీ కే చక్రవర్తి, ఎస్ఈబీ సూపరింటెండెంట్ అరుణకుమారి, ఏలూరు ఇన్చార్జి డీఎస్పీ పైడేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రెండేండ్లుగా స్వాధీనం చేసుకున్న రూ.1.29 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో చెప్పారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యం తయారీ లేకుండా చూసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కల్తీ మద్యం తయారీలో ఉన్న గ్రామాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ఏడుగురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం అక్రమ రవాణా కేసుల్లో పదే పదే పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఎస్సీ హెచ్చరించారు.