వాషింగ్టన్: కరోనా సంక్షోభంతోపాటు విద్యుత్ కార్లకు డిమాండ్ పెరగడంతో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ గతేడాది భారీ సంపదను పోగేసుకుని రికార్డు సృష్టించారు. కానీ కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అమెరికా సర్కార్ విడుదల చేసిన బాండ్ల కొనుగోలు కోసం పెట్టుబడిదారులు పోటీ పడుతున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో టెస్లా షేర్లు పతనం అయ్యాయి.
దీంతో గతవారం ఎలన్మస్క్ నికర సంపద పడిపోయింది. సోమవారం-శుక్రవారం మధ్య ఆయన సంపద ఏకంగా రూ.1.97 లక్షల కోట్లు (27 బిలియన్ డాలర్లు) కరిగిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద 156.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కంటే మస్క్ సంపద 20 బిలియన్ డాలర్లు తక్కువ.
కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. సెప్టెంబర్ తర్వాత గత మూడు వారాలుగా నాస్డాక్-100 ఇండెక్స్ పతనం అవుతూనే ఉంది. ఈ క్రమంలో గత నాలుగు వారాల్లో మస్క్ సంపద ఊహించిన దానికంటే భారీగా దిగజారుతూ వచ్చింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ నాలుగు వారాల్లో 230 బిలియన్ డాలర్ల మేరకు పడి పోయింది. ఈ ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పతనమైంది. 2019 మే తర్వాత ఈ స్థాయిలో టెస్లా షేర్ పతనం కావడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 574 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో ఇది 837 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. 2020లో టెస్లా కంపెనీ షేర్ల విలువ 743 శాతం పెరగడంతో ఏడాదిలోనే మస్క్ సంపద భారీగా ఎదిగింది.
కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగడంతో జనవరిలో ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఎలన్ మస్క్ నిలిచారు. కానీ, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఎక్కువ కాలం సంపన్నుల్లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయారు.
ఇటీవల మస్క్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్లోనూ పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్ విలువ పడిపోవడం కూడా ఎలన్ మస్క్ సంపద తరుగుదలకు ఒక కారణంగా ఉంది. గత నెలలో 1.5 బిలియన్ల డాలర్ల మేరకు బిట్ కాయిన్లో మస్క్ పెట్టుబడి పెట్టారు. కానీ గత రెండు వారాల్లోనే అందులో 15 బిలియన్ల డాలర్ల మేరకు మస్క్ సంపద తుడిచిపెట్టుకు పోయింది.
ఎలన్ మస్క్ మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న చైనా బాటిల్డ్ వాటర్ టైకూన్ ఝోంగ్ షాన్షన్ కూడా సంపదను కోల్పోయిన ప్రముఖుల్లో ఉన్నారు. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ గత నెలలో 22 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు. అయితే, గూగుల్ ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు సెర్జెయి బ్రిన్, ల్యారీ పేజ్ ఈ ఏడాది భారీగా లబ్ధి పొందారు. 2021లో వారు 13 బిలియన్ల డాలర్లకు పైగా సంపద పెంచుకున్నారు.