ఇస్తాంబుల్: టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్ ప్రావిన్సులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ కూడా ఉన్నారు. బిట్లిస్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిందని, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలంలోనే మరణించారని, మరో ఇద్దరు దవాఖానలో మృతి చెందారన్నారు. ఇంకా ఇద్దరు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కాగా, ఉస్మాన్ ఎర్బాస్ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.