సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 23: విద్యుత్తు రంగంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటివని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్తురంగంలో కేంద్రం తెచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ఒక్క ఉద్యోగుల సమస్య మాత్రమే కాదని, వ్యవసాయ, పరిశ్రమ తదితర రంగాలతోపాటు దేశంలోని గృహ వినియోగదారులపైనా పెనుభారం పడబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
డిస్కమ్స్ ప్రైవేటీకరణ అంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. తద్వారా ధరల నియంత్రణ పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు. పెట్టుబడిదారులకు విద్యుత్తురంగాన్ని అప్పగించబోతున్నారని.. సీఎం కేసీఆర్ మొదటి నుంచీ ఇదే చెప్తున్నారని, నేడు అది నిజమైందని పేర్కొన్నారు. ఉద్యోగులతోపాటు యావత్దేశం దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలకులు తెచ్చిన విద్యుత్తు చట్టాల సవరణపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే జీవోలు, సర్క్యులర్ల పేరుతో అవే అంశాలు అమలు పరుస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు.