కామారెడ్డి, ఆగస్టు 7 : వినియోగదారులకు షాక్ తగిలేలా కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ చట్టానికి ఆమోద ముద్ర లభిస్తే అధిక ప్రభావం మన మీదే పడనున్నది. కేంద్ర ప్రభుత్వం నేడు నూతన విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా.. విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. రాష్ర్టాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇక కేంద్రం చేతుల్లోకి వెళ్తుండడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న్ల కొత్త స్కీం ఆశ చూపి తర్వాత ఊహించని స్థాయిలో బిల్లులు వసూలు చేసేందుకు సమాయత్తం అవుతున్నది. ష్టాల పేరుతో సబ్సిడీ కరెంట్కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నది. వ్యవసాయానికి బిల్లుల వసూళ్ల పేరుతో కొత్త విద్యుత్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నది.
నూతన చట్టం అమలైతే ప్రతి ఒక్క రూ కేంద్రం నిర్దేశించిన ఆధారంగా కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ.100 బిల్లు వచ్చే వినియోగదారుడుకి ఊహించని విధంగా బిల్లుతో కష్టాలు తప్పవని విద్యుత్రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కొత్త విద్యుత్ నియంత్రణ బిల్లు కేవలం విద్యుత్ ఉద్యోగులకే కాకుండాప్రజల నెత్తిన పిడుగులా మారే అవకాశం ఏర్పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విద్యుత్ చట్టం ఉద్యోగులకు సంబంధించిందనే భావన కాకుండా అందరి మీద ప్రభావం చూపే పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకు సమాయత్తం అవుతున్నారు. ఉమ్మడి జాబితాలో ఉండే విద్యుత్ రంగం కేంద్రం పరిధిలోకి వెళ్లడం కారణంగా రాష్ర్టాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి కేంద్రం గుప్పిట్లోకి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు మేల్కొనకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఏర్పడుతుంది.
రాష్ట్రంలో 24గంటల నాణ్యమైన విద్యుత్…
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యవసాయ రంగానికి అందిస్తుంది. కొత్త విద్యుత్ చట్టం కారణంగా ఊహించని మార్పులు రానున్నాయి. తర్వాత సంస్కరణల పేరుతో పూర్తిగా ప్రైవేటు పరంగా మార్చే పరిస్థితి ఏర్పడనున్నదని విద్యుత్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
విధుల బహిష్కరణకు ఉద్యోగుల సన్నద్ధం
కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకరాబోతున్న నూతన విద్యుత్ చట్టంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతాయి. ఉద్యోగసంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి. నూతన చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి నోటీసును విద్యుత్ సంఘాలు అందించాయి. విద్యుత్ బిల్లును నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రాల్లో, సబ్స్టేషన్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సమాయత్తం అవుతున్నారు.
ప్రైవేట్పరం కాకుండా అడ్డుకోవాలి
కేంద్రం తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటాం. దీంతో సోమవారం పార్లమెంట్లో బిల్లు రానుండడంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యుత్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా మరిన్ని నిరసన కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి నోటీసులు ఇచ్చాం.
– ఎడ్ల సంపత్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఐఎన్టీయూసీ, 327 విద్యుత్ సంఘం నేత
అన్ని వర్గాలపై ప్రభావం
విద్యుత్ చట్టం రైతాంగం, విద్యుత్ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. నష్టపరిచే విధంగా ఉన్న విద్యుత్ బిల్లు తీసుకువస్తే ఊరుకునేది లేదు. ప్రైవేట్ పరం అయినట్లయితే కరెంట్ కష్టాలు తీవ్రమవుతాయి. ఇష్టానుసారంగా ఎప్పుడైనా బిల్లులు, స్లాబ్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సబ్సిడీలు, రాయితీలకు మంగళంపాడే అవకాశం ఉంటుంది. జేఏసీ ఆధ్వర్యంలో బిల్లుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతాం.
– శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ ఉద్యోగి, ఎల్లారెడ్డి