ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా
న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్లలో అమ్ముడైన మొత్తం యూనిట్లు ఈ ఒక్క ఏడాదిలోనే సేల్ కావచ్చన్నది. 2021లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు రెండు రెట్లు పెరిగి 2,33,971 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో హై-స్పీడ్ స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2020లో 1,00,736లు అమ్ముడయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈవీ విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయని.. గత 15 ఏండ్లలో పది లక్షల యూనిట్లు అమ్ముడవగా.. వీటిలో
టూవీలర్లు, త్రీవీలర్లు, కార్లు, బస్సులు ఉన్నాయని పేర్కొంది. పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో వీటి వాడకాన్ని తగ్గించిన కస్టమర్లు ఇదే స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపింది. తక్కువ ధరకే వాహనాలు లభిస్తుండటం, తక్కువ ఖర్చు.. మెయింటనెన్స్ తక్కువగా ఉండటం కూడా కలిసొస్తున్నది.