న్యూఢిల్లీ, జూన్ 7: భగ్గుమంటున్న పెట్రో ధరల నేపథ్యంలో దేశంలో విద్యుత్ ఆధారిత (ఎలక్ట్రిక్) ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరిగింది. కేవలం ఇంధన భారంతోనేగాక మెయింటేనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీలు కూడా ఈవీల కొనుగోళ్లకు కలిసొచ్చాయి. అయితే గత నెలలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మే నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ కరువైంది. ఏప్రిల్తో పోల్చితే 27 శాతం రిజిస్ట్రేషన్లు క్షీణించినట్టు తాజా గణాంకాల్లో తేలింది. అమ్మకాలపరంగా చూస్తే ఒకినావా అగ్రస్థానంలో ఉన్నా.. ఏప్రిల్ కంటే 19.28 శాతం సేల్స్ దిగజారాయి. ఓలా, ఆంపెర్, హీరో ఎలక్ట్రిక్ విక్రయాలూ తగ్గుముఖం పట్టాయి. క్రితంతో పోల్చితే టాప్-5 సంస్థల్లో ఏథర్ వాహన అమ్మకాలే పెరిగాయి.
ప్రమాదాల దెబ్బ
ఎలక్ట్రిక్ టూవీలర్లు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ తీసిందని విశ్లేషకులు చెప్తున్నారు. పలు ఘటనల్లో మరణాలకూ దారి తీయడం అమ్మకాలను ప్రభావితం చేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే భయాందోళనకు లోనైన కొనుగోలుదారులు వెనుకడుగు వేశారని పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదాలతో ఆయా ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్లపై ప్రభుత్వం నిఘా కూడా పెట్టగా, తయారీలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించింది. ఈ క్రమంలో ప్యూర్ ఈవీ వంటి కంపెనీలు వాహనాల రీకాల్కు కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
చిప్ల కొరత
మరోవైపు గత నెలలో అమ్మకాలు పడిపోవడానికి చిప్ల కొరత కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సెమీకండక్టర్ చిప్ల లభ్యత చాలా తక్కువగా ఉండటం వాహన ఉత్పత్తిని ప్రభావితం చేసిందని వివరిస్తున్నాయి. డిమాండ్కు తగ్గ సరఫరా లేక కూడా సేల్స్ జరగలేదని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో నెంబర్ వన్గా ఉన్న తాము మళ్లీ అగ్రస్థానంలోకి వస్తామన్న ధీమాను హీరో ఎలక్ట్రిక్ వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం ఈవీ మార్కెట్లో పెట్రో విభాగంలో టాప్లో ఉన్న హీరోతోపాటు టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ మోడల్స్ కూడా లభిస్తున్న విషయం తెలిసిందే.