కోల్కతా: పదే పదే తమపై ఆరోపణలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బలమైన సందేశాన్ని పంపించింది. ప్రతిసారీ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ ఎన్నికల సంఘం స్థాయిని దిగజార్చడం సరికాదని స్పష్టం చేసింది. పదే పదే ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులను కోల్కతాలో, ఢిల్లీలో రెండుసార్లు ఎన్నికల సంఘం కలిసింది. అయినా కూడా ఈసీ పార్టీలను కలవాలని అనడం సంఘం ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు మమత రాసిన లేఖకు ఈసీ సమాధానమిచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి మేలు చేస్తోందని మమత పదే పదే ఆరోపించడం దురదృష్టకరమని స్పష్టం చేసింది. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత.. కేంద్ర హోంమంత్రి ఆదేశాల ప్రకారమే ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపించారు.