చండీగఢ్: ఒక ఎద్దు తన కొమ్ములతో వృద్ధుడ్ని గాల్లోకి ఎత్తి పడేసింది. హర్యానాలోని ఫరీదాబాద్లో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. టీ అమ్ముకునే ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా ఆ వృద్ధుడిపై దాడి చేసింది. కొమ్ములతో ఆయనను గాల్లోకి విసిరింది. దీంతో ఆ వృద్ధుడు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను కాపాడేందుకు పరుగున వెళ్లారు. ఎద్దు దాడిలో గాయపడిన ఆ వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు వీధుల్లో సంచరించే పశువుల బారిన పడి పలువురు మరణిస్తున్నారు. హర్యానాలో పశువుల దాడి, ప్రమాదాల వల్ల గత ఐదేళ్లలో 900 మందికిపైగా మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. పశువుల దాడిలో 919 మంది చనిపోగా 3,017 మంది గాయపడినట్లు వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి జేపీ దలాల్ తెలిపారు.