వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. వృద్ధులు అనారోగ్యం బారినపడితే నిరాదరణకు గురవుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వారి పట్ల నిర్లక్ష్యం రోజురోజుకూ పెరుగుతున్నది. వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస జటిల, సామాజిక సమస్యగా పరిణమించింది. వేగవంతమైన జీవనవిధానం, హైటెక్ కల్చర్ వృద్ధులను సామాజికంగా వెనకకు నెట్టివేస్తున్నది. మారిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల కారణంగా వృద్ధులు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు.
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం. ఊతకర్రల సాయంతో నడిచే వృద్ధులు వీధుల్లోకి నెట్టివేయబడి అనాథలుగా మిగిలిపోతున్నారు.
ఏటా అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. వృద్ధుల పట్ల నేటితరం చూపిస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుని మొట్టమొదటిసారి 1984లో వియెన్నాలో వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘సీనియర్ సిటిజన్’ అనే పదాన్ని మొదటిసారి వాడింది ఈ సదస్సులోనే. 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారుచేసి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించింది. తొలిసారి 1991 అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. 1999లో భారతదేశ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఒక జాతీయ ప్రణాళికను రూపొందించింది.‘ఆహార భద్రత’, ‘ఆరోగ్యం రక్షణ’, ‘నివాసం వసతి’లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్రణాళిక నేటికీ అమలుకు నోచుకోలేదు.
2004లో వృద్ధుల సమస్యలపై స్పెయిన్లో 86 దేశాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, సంరక్షణ కోసం 46 తీర్మానాలు ఆమోదించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉదాసీనత వల్ల వృద్ధుల సమస్యను సామాజిక సంక్షేమ కోణంలో ఆలోచించకపోవడం శోచనీయం. కుటుంబ పరువు నెపంతో చాలామంది వృద్ధులు తమపై జరిగే వేధింపులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. మీడియా, ప్రసార సాధనాలు కూడా వృద్ధుల సమస్యలకు పరిష్కారం చూపడంలో తమ వంతు పాత్ర పోషించలేకపోతున్నాయి. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వివిధ రూపాల్లో కనపడుతున్నది. సామాజిక, ఆర్థిక నిర్లక్ష్యంతో పాటు ఆహారం, ఔషధాలు, భద్రత, పరిశుభ్రత వాటిలో ప్రధానమైనవి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లో వృద్ధుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రాధాన్యం ఇవ్వాలి. వృద్ధులకు ఉచిత వైద్యసేవలు, రవాణా సౌకర్యం కల్పించాలి. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక పెద్దల దుర్వినియోగాన్ని మానవ హక్కుల సమస్యగా పెర్కొన్నదంటే సమాజంలో వృద్ధులు ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
2030 నాటికి ప్రపంచ వృద్ధ జనాభా 1.4 బిలియన్లకు చేరుతుందని ఒక అంచనా. మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏండ్లు దాటిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నారు. రానున్న ఇరువై ఏండ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుందని ఒక అంచనా. భారత ప్రభుత్వం 2007లో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశాలు జారీచేసింది.
వృద్ధుల పట్ల నేటితరం చూపిస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుని మొట్టమొదటిసారి 1984లో వియెన్నాలో వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘సీనియర్ సిటిజన్’ అనే పదాన్ని మొదటిసారి వాడింది ఈ సదస్సులోనే. 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారుచేసి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరి అమలుచేయాలని ఆదేశించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటిమంది వృద్ధులున్నారు. వీరిలో 25 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు చేసి విశాంత్రి తీసుకుంటున్నవారు. వీరికి ఫించన్ వస్తున్నది. 15 శాతం వృద్ధులు సొంత ఇండ్లు, వ్యవసాయ భూముల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. మరో 15 శాతం మంది వృద్ధులు పలురకాల వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరో 10 శాతం మంది కుటుంబసభ్యుల సంరక్షణలో ఉన్నారు. వీరంతా బాగానే ఉన్నా, మిగిలిన 35 శాతం మంది వృద్ధుల గురించే మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో 25 లక్షల మంది వృద్ధులు గ్రామాల్లో జీవిస్తున్నారు. ఈ వృద్ధులు ఆర్థిక, సామాజిక, అనారోగ్య బాధలు పడుతున్నారు. అసంఘటితరంగంలో 60 ఏండ్లు పైబడిన దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు ఉన్నారు. వీరికి ఎలాంటి ఆర్థిక వనరులు, ఆదాయం లేక పస్తులతో జీవితాలను గడుపుతున్నారు. చాలామంది వృద్ధులు తమ పిల్లలను ఉన్నతచదువులు చదివించి విదేశాలకు పంపితే ఉద్యోగాల పేరుతో వారు అక్కడే స్థిరపడి ఇప్పుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4 నుంచి 6 శాతం వృద్ధులు ఏదో ఒక రకమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారని పలు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. వృద్ధుల నిర్లక్ష్యం అనేది సామాజిక సమస్యగా మారింది. వేధింపులకు గురవుతున్న వృద్ధులు తరచూ తమను వేధిస్తున్నవారిని ప్రదర్శిస్తున్నారు. దీనితో వారిపై జరిగే హింస, మానసిక ఒత్తిడి, క్షోభ బాహ్య సమాజానికి తెలియకుండా పోతున్నది. వృద్ధులపై జరిగే వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘నేషనల్ సెంటర్ ఆన్ లా ఎల్డర్స్ రైట్స్’, ‘savvy saving seniors’ వంటి పోర్టర్లు అందుబాటులో ఉన్నాయి.
వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితవైద్యం, కార్పొరేట్ దవాఖానాల్లో రాయితీతో కూడిన వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఆర్టీసీ, రైల్వేలలో ప్రస్తుతం ఉన్న రాయితీని పెంచాలి. వీటితో పాటు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి వృద్ధుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి. వృద్ధుల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని మానవ వనరుల అభివృద్ధికి వినియోగించుకోవాలి. అప్పుడే దేశంలో ఆరోగ్యకరమైన కుటుంబవ్యవస్థ నిర్మితమవుతుంది.
(వ్యాసకర్త: సామాజిక,ఆర్థిక అధ్యయన వేదిక అధ్యక్షులు)
(నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం)
నేదునూరి కనకయ్య: 94402 45771