మంగపేట, ఆగస్టు 1: అరవై ఏండ్లు అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భార్య మృతిచెందిన మూడు గంటల్లోపే మనోవేదనకు గురైన భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెంలో జరిగింది.
గ్రామానికి చెందిన మండల సమ్మయ్య (85), పార్వతమ్మ (80) దంపతులు. కొద్దిరోజులుగా ఇద్దరూ అనారోగ్యం బారినపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధ్థరాత్రి దాటాక పార్వతమ్మ మృతిచెందింది. భార్య మృతితో మనోవేదనకు లోనైన సమ్మయ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.