బీర్కూర్, సెప్టెంబర్ 23: పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించే ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా మంత్రుల అధ్యక్షతన కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ, రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు పాస్ పుస్తకాలను అందించిన మొదటి మండలం బీర్కూర్ అని, నియోజకవర్గం బాన్సువాడ అని తెలిపారు. కాగా, బీర్కూర్ మండలంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించి, రాష్ట్రంలోనే మొదటిసారి నూతన పాసు పుస్తకాలను ముగ్గురు రైతులకు స్పీకర్ అందజేశారు.