మహేశ్వరం, మే 6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్లో మన ఊరు- మనబడిపై సమీక్ష సమావేశాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరంలోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.4 కోట్ల 70 లక్షలు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. ఈ నిధులను పాఠశాలల మరమ్మతులు, వంట రూములు, టాయిలెట్స్, గ్రీనరీ, మంచినీరు ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్ నుంచి ఇంగ్లీస్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆమె పార్టీ నాయకులకు సూచించారు. గ్రామాలలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా నాయకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునిత, తసీల్దార్ ఆర్పీ జ్యోతి, సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్అలీ తదితరులు పాల్గొన్నారు.