మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేటలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం రేపటి నుంచి (గురువారం) పునఃప్రారంభం అవుతున్నట్లు ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు.
ఇటీవల జాతర కాగానే ఆలయ ఈవోతో పాటు మరో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా మార్చి 20వ తేదీ నుంచి ఆలయాన్ని మూసివేశారు.
ఆలయ ఈవో , సిబ్బంది బుధవారం ఏడుపాయల ఆలయాన్ని తెరిచి సంబంధిత సిబ్బందితో మొత్తం ఆలయాన్ని, ఆఫీస్ కార్యాలయంతో పాటు ఇతరత్రా కార్యాలయాల శానిటైజేషన్ చేయించారు.
గురువారం ఉదయం వేకువజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి సంప్రోక్షణ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని ఈవో వెల్లడించారు.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.