ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన విద్యా సామర్థ్యాలను సాధించడానికి ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దవచ్చని గ్రహించి, అయిదు వేల గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు 2022-23 విద్యా సంవత్సరంలో మూడు పద్ధతులను అమలు చేస్తున్నది. అందులో మొదటిది మన ఊరు-మన బడి, రెండవది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, మూడోది తొలి మెట్టు కార్యక్రమం. విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలను, విద్యా ప్రమాణాలను పెంపొందించడం తొలిమెట్టు కార్యక్రమం ప్రధాన లక్ష్యం. తొలి మెట్టు కార్యక్రమం ద్వారా 23,179 ప్రాథమిక పాఠశాలల్లో 11,24,563 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
తప్పులు లేకుండా చదవడం అభ్యసన సామర్థ్యాలకు కొలమానం. విద్యా సామర్థ్యాలు సాధించాలంటే విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తొలి విడతలో సమగ్ర శిక్ష అభియాన్ నిధులతో 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నారు. రూమ్ టు రీడ్ సంస్థ రూపొందించిన 200 పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. వివిధ తరగతులకు విద్యార్థుల కోసం ఆరు కథల పుస్తకాలను రూపొందించారు.
తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో ‘ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పేరిట 140 రోజులపాటు అమలు చేస్తారు. చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, గణితంలో తగిన పరిజ్ఞానం, భాషపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం. విద్యార్థుల కోసం గ్రంథాలయాలు స్థాపించి, వారు పుస్తకాలు చదివేలా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తారు. ఈ కార్యక్రమాన్ని 600 మంది నోడల్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
ఈ అధికారులు వారంలో రెండు రోజులు మండలంలోని పాఠశాలను సందర్శిస్తారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు, సెక్టోరియల్ అధికారులు, డీఈవోలు ప్రతి నెల పాఠశాలలకు వెళ్లి తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తారు. విద్యార్థి భావి జీవితానికి ప్రాథమిక విద్య పునాది. ఈ నేపథ్యంలో వారిలో విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి తొలిమెట్టులో కార్యక్రమం అమలు కోసం 52 వేల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. దీనిలో భాగంగానే రీడ్ అనే కార్యక్రమాన్ని 100 రోజుల పాటు నిర్వహించను న్నారు. ‘గ్రంథాలయాలు ఊహా శక్తికి ప్రేరణనిస్తాయి. ప్రపంచ జ్ఞానానికి తలుపులు తీసి మ నలో స్ఫూర్తిని నింపుతాయి. మన జీవన నా ణ్యతను పెంపొందిస్తాయని’ సిడ్నీ షెల్డన్ అన్నా రు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ప్రతి గ్రంథాలయంలో కథల పుస్తకాలు, చందమామ పుస్తకాలు, నీతి కథల పుస్తకాలు చిన్న పిల్లలకు త్వరగా అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి గ్రంథాలయంలో అవసరమైన వసతులు సమకూర్చి, ఒక గ్రంథాలయ పాలకుడిని నియమిస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. అప్పుడు మన విద్యార్థులు మరింత జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.
– డాక్టర్ రవికుమార్ చేగొని
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం)