హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటి వరకు రెండు విడుతల డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాగా, ప్రస్తుతానికి మూడో విడుత కొనసాగుతున్నాయి. తాజాగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడుత దరఖాస్తుల గడువును పొడగించారు. దోస్త్ మూడో విడుత రిజిస్ట్రేషన్లు సహా వెబ్ ఆప్షన్ల గడువును పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు.
ఆయా షెడ్యూల్ను బుధవారం విడుదల చేశారు. అంతేకాకుండా ఒకే కాలేజీలో కోర్సులు మార్చుకునేందుకు గాను ఇంట్రాకాలేజీలో వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ను సైతం ఆయన విడుదల చేశారు. రూ. 400ఫీజుతో రిజిస్ట్రేషన్ ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్లు 23వ తేదీ, సీట్లు కేటాయింపు 27, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 30, కళాశాలలో రిపోర్టింగ్ 30వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.