‘కుమ్రం భీం’ ఈ పేరే ఒక చైతన్యం. జల్-జమీన్-జంగిల్ ఆయన నినాదం. పోరాటం ఆయన జీవన విధానం. గెరిల్లా పోరు ఆయన బలం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరు సల్పిన అడవి బిడ్డ ఆయన. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కుమ్రం భీం గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తిమంత్రం.
గోండు తెగకు చెందిన కుమ్రం చిన్నూమ్, సోం బాయి దంపతులకు 1901లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సంకేపల్లిలో కుమ్రం భీం జన్మించారు. భీంకు 15 ఏండ్ల వయస్సున్నప్పుడు అటవీ అధికారుల దాడిలో ఆయన తండ్రి మరణించారు. దీంతో కుమ్రం భీం కుటుంబం సర్దాపూర్కు వలసవెళ్లింది. అక్కడ వాళ్లు సాగు చేసుకుంటున్న భూమిని ఒక జమీందారు స్వాధీనం చేసుకోవడంతో భీం కోపంతో అతడిని హత్యచేసి అసోం వెళ్లిపోయారు. అక్కడ ఐదేండ్లు పనిచేసిన తర్వాత తెలంగాణకు తిరిగివచ్చారు. అప్ప ట్లో ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనులు దుర్భర జీవితం గడిపేవారు. నిజాం నవాబు పశువుల కాపర్లపైనా సుంకం విధించారు.
అడవి తమ సొత్తు అని భావించిన గిరిజనులు నిజాం విధించిన పన్నును వ్యతిరేకించారు. కుమ్రం భీం వారికి నాయకత్వం వహించారు. గెరిల్లా పద్ధతిలో సాయుధ పోరాటం సాగించారు. దీంతో నిజాం సైన్యం అటవీ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. అడవిని నరికివేస్తే జంగ్లాత్ భూమి అని, లేదంటే రెవెన్యూ భూమి అని గోండులను తరిమేసింది. పంటలను ధ్వంసం చేసి, జరిమానా విధించింది. ఈ వేధింపులకు, అణచివేతలకు వ్యతిరేకంగా గోండులు, కోలామ్లు పోరుబాట పట్టారు. మా ఊర్లో మా రాజ్యం అంటూ 12 గిరిజన గ్రామాలు పోరాటం సాగించాయి. ఈ పోరాటానికి కుమ్రం భీం నాయకత్వం వహించారు.
నాడు జోడెన్ఘాట్ లోని కొండలు, గుట్టలను స్థావరంగా చేసుకొని కుమ్రం భీం సాయుధ పోరాటం సాగించారు. నేరుగా కుమ్రం భీం దళాలున్న కేంద్రాన్ని ముట్టడించి అణచివేయడం కష్టమని, గుట్టల మీద ఉన్న దళాలను దెబ్బతీయడానికి కింది ప్రాంతంలో ఉన్న ప్రజలను హింసించాలని అధికారులు నిజాంకు సూచించారు. దీంతో గుట్టల మీదికి ఆహారం, ఇతర సరుకులు వెళ్లకుండా పోలీసులు దిగ్బంధం చేశారు. మైదాన ప్రాంతంలోని గూడేల మీద పడి ప్రజలపై హింసాకాండకు పూనుకున్నారు. దీంతో గూడేలు అల్లకల్లోలమయ్యాయి. సర్వం కోల్పోయినవాళ్లు జోడెన్ ఘాట్కు వెళ్లసాగారు. దీంతో జోడెన్ఘాట్ జనంతో నిండిపోయింది. నాలుగు నెలల పాటు నిజాం మూకలు గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించాయి. దీంతో గిరిజనులు కుమ్రం భీంకు తమ బాధలను చెప్పుకోవడం ప్రారంభించారు.
‘మేం కావాలని యుద్ధం చేయడం లేదని, 12 గ్రామాల మీద తమకు అధికారం ఇస్తే నిజాంకు విధేయులమై ఉంటామని’ భీం ప్రతిపాదించారు. అయినా నిజాం ప్రభుత్వం ఆయన మాట వినలేదు. భీం తరఫున రాయబారిగా వెళ్లిన సూరును తహశీల్దార్ దూషించి వెనక్కి పంపించాడు. ఆ సమాచారం అందంగానే కుమ్రం భీం సైన్యాన్ని అప్రమత్తం చేశారు. పోరాటాన్ని ఉధృతం చేశారు.
కానీ నిజాం సర్కారు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. చెక్పోస్టులను ఏర్పాటుచేసి రహస్య దళాల కోసం గాలింపు చేపట్టింది. కుమ్రం భీం నిజాం సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యేలోపే 300 మంది నిజాం సైనికులు జోడెన్ఘాట్ కొండపైకి దాడిచేశారు. కొండపైకి ఎగబాకుతున్న సైనికుల మీదికి గోండులు, కోలామ్లు బండలు దొర్లించారు. సైనికులు తుపాకులు పేలుస్తూ పైకి వెళ్లారు. తమపై దాడి ఆపితే గిరిజనులకు భూమి పట్టాలిస్తామని తహశీల్దార్ బిగ్గరగా అరవడంతో గిరిజనుల్లో ఆశ పుట్టి బండలు దొర్లించడం ఆపేశారు. దీంతో వెంటనే పైకి చేరుకున్న సైనికులు కుర్దు పటేల్ అనే వ్యక్తి సాయంతో కుమ్రం భీం సైన్యంలోని ముఖ్యులను గుర్తించి కాల్పులు జరిపారు. కుర్దుపటేల్ కుమ్రం భీంను కెప్టెన్ బ్రాండస్కు చూపించడంతో అతడు కాల్పులు జరిపాడు. తూటా దెబ్బలకు భీం కుప్పకూలిపోయాడు. నిజాం సైన్యం కాల్పుల్లో 200 మంది మరణించారు.
కొండ కోనల్లో ప్రకృతితో కలిసి సహ జీవనం చేసే ఆదివాసీలకు అడవిపై హక్కులు కావాలని పోరాడిన యోధుడు కుమ్రం భీం. 1928-1948 వరకు ఆయన నిజాం సర్కారుతో రాజీలేని పోరాటం చేశారు. ఆయన పోరాటం ఆ తర్వాతికాలంలో ఎందరో గిరిజనులకు స్ఫూర్తినిచ్చింది.
(నేడు ‘కుమ్రం భీం’ వర్ధంతి)
ఆలేటి రమేష్
99487 98982