కేంద్రంలో నిరంకుశ అధికారం నెలకొని, రాజకీయ బహుళత్వానికి ఎన్నో విధాలుగా ముప్పు ఏర్పడిన తరుణంలో, ఈడీ చట్టానికి చేసిన సవరణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయస్థానం ద్వారా ఊరట పొందాలని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం తమ తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు విపక్షాలు సంయుక్త ప్రకటన జారీ చేయవలసి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాధ్యతలను నిర్దేశించే ‘నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం’ (పీఎంఎల్ఏ)లోని నిబంధనలు, ఆ చట్టానికి మోదీ సర్కార్ చేసిన సవరణలను సవాల్ చేస్తూ పలు ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు, వ్యక్తులు 240కిపైగా పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పీఎంఎల్ఏలోని నిబంధనలన్నీ సవ్యంగానే ఉన్నాయని పేర్కొంది. అసలు విషయమైన, సవరణలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని తెలిపింది.
పీఎంఎల్ఏ చట్టానికి మోదీ ప్రభుత్వం 2019లో అనేక సవరణలను ఆర్థికబిల్లు రూపంలో తీసుకొచ్చింది. వీటిద్వారా ఆ చట్టం అంతకుముందుకన్నా మరింత కఠినంగా మారిపోయింది. పార్లమెంటు ప్రక్రియను తప్పించుకోవటానికి, తాను అనుకున్న చట్ట సవరణలను తీసుకురావటానికి కేంద్రప్రభు త్వం ఆర్థిక బిల్లులను దొడ్డిదారిగా ఉపయోగించుకుంటున్నదని విపక్షాలు కొన్నేండ్లుగా చేస్తు న్న ఆరోపణ. పీఎంఎల్ఏ విషయంలోనూ కేంద్రం ఇదే మార్గాన్ని అనుసరించటంపై ప్రతిపక్షాలు తమ పిటిషన్లలో అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. వీటిని విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సి ఉంది. ఇంతలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనిపై 17 విపక్ష పార్టీలు ఉమ్మడిగా అభ్యంతరం తెలిపా యి. ఆర్థికబిల్లు ద్వారా తెచ్చిన సవరణలు చెల్లవని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తేల్చినట్లయితే ఈ తీర్పు రద్దవుతుందని గుర్తు చేశాయి. ఈలోపే తీర్పు రావటం వల్ల ప్రతిపక్షాలపై ప్రభుత్వం జరుపుతున్న అణచివేత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు మునుపెన్నడూ లేనంత దూకుడుగా పనిచేస్తున్నాయి. అయితే, ఈ దూకుడు అంతా కూడా ప్రతిపక్షాలపై, విమర్శకులపై, సామాజిక కార్యకర్తలపై చూపటం మీదే అభ్యంతరం వ్యక్తమవుతున్నది. వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరితే చాలు వారిపై కేసులు వెంటనే మాయమయ్యే పరిస్థితి. ఇంత నిరంకుశంగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరుగుతున్నది. ఆరోపణలు రుజువు చేయటం తర్వాత సంగతి, ముందైతే కేసు పెట్టెయ్యాలి అన్న ధోరణిలో ఈ సంస్థలను ఉరికిస్తున్నారు కేంద్ర పెద్దలు. యూపీఏ కాలంలో ఈడీ 112 సోదాలు జరుపగా, మోదీ హయాంలో ఈ ఎనిమిదేండ్లలోనే 3,010 దాడులు జరిగాయి. దాదాపు లక్ష కోట్ల ఆస్తులు జప్తు చేశారు. దోషులుగా తేలింది 23 మంది మాత్రమే. రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి, వారి పరువు ప్రతిష్ఠలను, ఆర్థిక మూలాలను దెబ్బతీయటానికి ఏ స్థాయిలో ఈడీని నరేంద్రమోదీ ప్రభుత్వం వినియోగించుకుంటున్నదో ఈ గణాంకాలు కండ్లకు కడుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వ నిరంకుశ పోకడలకు కళ్లెం వేస్తుందని ప్రజాస్వామ్య ప్రియులు ఆశిస్తున్నారు.