గిరిజన వర్గానికి చెందిన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించడం భారత ప్రజాస్వామ్యానికి మరింత శోభను కలి గించింది. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో సంతాల్ తెగకు చెం దిన సామాన్య కుటుంబంలో జన్మించిన ముర్ము విద్యావంతురాలై, మొదట ఉద్యోగిగా మారి, ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పటివరకు అల్పసంఖ్యాకవర్గాలకు, దళితులకు రాష్ట్రపతి పీఠం దక్కింది. అత్యున్నత పీఠానికి మహిళ చేరుకోవడం ఇది రెండవసారి. కానీ గిరిజన వర్గానికి దక్కడం, అందులోనూ మహిళ కావడం విశేషమే. ముర్ముకు గతంలో గవర్నర్ పదవిని నిర్వహించిన అనుభవం ఉన్నది. అందువల్ల ఆమె సామాజిక నేపథ్యాన్ని మాత్రమే గుర్తిస్తూ, అర్హతను మసకబారనీయకూడదు.
బీజేపీ నాయకత్వం ముర్మును రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ఎంపిక చేసినప్పటికీ ఇది కేవలం ప్రతీకాత్మకం కాకూడాదు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేంద్రం నిర్దిష్ట కార్యాచరణను అమలుచేయాలి. పారిశ్రామికీకరణకు ప్రాముఖ్యం ఏర్పడిన నేపథ్యంలో గిరిజనుల ఆవాస ప్రాంతాలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా గిరిజనుల నిలయాలే. అభివృద్ధి కార్యక్రమాల మూలంగా గిరిజనుల తరలింపు సాధారణం. ఈ క్రమంలో గిరిజనుల పరిరక్షణకు గతంలో తెచ్చిన చట్టాలు ఆచరణలోనిర్వీ ర్యమవుతున్నాయి. వారికి పునరావాసం కలిగించినా, సాంస్కృతిక జీవనానికి జరిగే విధ్వంసం వెలకట్టలేనిది. అందువల్ల గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ, సంస్కృతిని పరిరక్షిస్తూనే వారి పురోభివృద్ధికి తోడ్పడాలి. గిరిజనాభివృద్ధి వంటి అంశాల్లో సంకుచిత రాజకీయ దృక్పథానికి తావుండకూడదు.
గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సామాజిక, ఆర్థికాభివృద్ధి చర్యలు గమనార్హమైనవి. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం వల్ల గిరిజనుల స్వపరిపాలనకు బాటపడ్డది. గిరిజనుల కోసం గురుకులాలు వృద్ధి చేసిన తర్వాత ఆయా వర్గాల నుంచి ఎంతో మంది విద్యావంతులు, వివిధ రంగాల ప్రతిభావంతులు ఎదిగివచ్చారు. గిరిజన తండాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడం వల్ల వారికి తాగునీటి సమస్య తీరడమే కాదు, ఆరోగ్య పరిరక్షణ కూడా జరుగుతున్నది. బంజారాలు, ఆదివాసుల కోసం హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కూడా వారి సర్వతోముఖాభివృద్ధికి దారితీస్తుంది. బీజేపీ పెద్దలు కూడా మొక్కుబడిగా ఎవరో ఒకరికి పదవి కట్టబెట్టడంతో సరిపెట్టకూడదు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ర్టాలతో చర్చలు జరిపి, ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణమైన పథకాలు, వ్యూహా లు రూపొందించాలి. రాష్ట్రపతి పదవిని అలంకరించిన ద్రౌపది ముర్ము గిరిజనుల, మహిళల అభ్యున్నతి కోసం తమవంతు కృషి సాగిస్తారని ఆశిద్దాం.