‘పునరపి జననం పునరపి మరణం- పునరపి జననీ జఠరే శయనమ్’ అన్నట్లు గా మళ్లీమళ్లీ పుడుతూ, గిట్టుతూ సంసార చక్రంలో పడిన జీవుడు, ఏనాటికైనా సంసార బంధం నుంచి విముక్తుడై మోక్షార్హతను సాధించవలసిన వాడే. మోక్షా న్ని పొందడానికి అవసరమైన అర్హత ఏమిటి? అనే ప్రశ్నకు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పద్ధతులతో శాస్త్రీయమైన సమాధానాలను తెలిపారు.
గురువు నుంచి మంత్రోపదేశం పొందడానికి వీలైన జన్మ మానవ ఉపాధే కాబట్టి మానవులుగా పుట్టినవారికే మోక్షార్హత ఉంటుందని తెలిపారు కొందరు. ఇటువంటి అవకాశం పశుపక్ష్యాదులకు లేదు. కాబట్టి అవి సులభంగా మోక్షాన్ని పొందలేవు అని పేర్కొన్నారు. సంసార సంబంధమైన దోషాలను సమూలంగా వదిలిన సన్యాసులకే మోక్షార్హత ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు. మోక్షార్హతను పొందడానికి కర్మయోగాన్నో, జ్ఞానయోగాన్నో అవలంబించాలని కొందరి భావన. భక్తి మార్గంలో ప్రయాణించాలి. శరణాగతి (ప్రపత్తి నిష్ఠ కలిగి ఉండాలి) చేయాలి అని కొంతమంది వివరించారు. ప్రత్యక్షంగా పరమాత్మను దర్శించలేం. కాబట్టి చాలామందికి భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడటం లేదు. అందుకే దయ, వాత్సల్యం మొదలైన సద్గుణ సంపద కలిగి ఉన్న గురువు పై విశ్వాసం ఉంచి, ఆయన ఉపదేశించిన మంత్రాన్ని ఉపాసించి మోక్షార్హత సాధించే సంప్రదాయమూ ఉంది.
ఇకపోతే మోక్షార్హత మనుషులతోపాటు పక్షులకు జంతువులకు కూడా ఉన్నది. భగవద్గీత ద్వారా, రామాయణ, భాగవత గ్రంథాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. భగవద్గీత తొమ్మిదో అధ్యాయం 32వ శ్లోకంలో ‘పూర్వ జన్మల పాపఫలంగా లభించిన పశు, పక్షి, క్రిమి, కీటకాది శరీరాలను పొందిన అల్పప్రాణులు కూడా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులైనప్పుడు మోక్షాన్ని పొందగలవు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.
పశుః మనుష్యః పక్షీవా యే చ వైష్ణవ సంశ్రయాః
తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదమ్
శాండిల్య స్మృతిలోని పైశ్లోకం.. ‘మానవులు, పశుపక్ష్యాదులు విష్ణుమూర్తి పట్ల గాని, విష్ణుభక్తుల పట్లగాని భక్తిప్రపత్తులను కలిగి ఉన్నట్లయితే అవి తప్పకుండా శ్రీవిష్ణు ధామమైన వైకుంఠ వాసం ప్రాప్తిస్తుంది’ అని తెలుపుతున్నది.
సీతాదేవిని లంకానగరానికి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జటాయువు రావణుడికి అడ్డుపడ్డాడు. శ్రీరామసేవగా సీతాదేవిని రక్షించేందుకు రావణాసురుడితో భీకర పోరాటం చేసి ప్రాణాలను కోల్పోయాడు. ఆ జటాయువు పక్షిజాతికి చెందినవాడైనా, తత్త్వజ్ఞానం లేకున్నా.. శ్రీరామచంద్రుడు బ్రహ్మమేధ సంస్కారం జరిపి మరీ మోక్షాన్ని ప్రసాదించాడు.
యా గతిః యజ్ఞ శీలానాం ఆహితాగ్నేశ్చ యా గతిః
అపరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినామ్
మయాత్వం సమనుజ్ఞాతో గచ్ఛలోకాననుత్తమాన్
గృధ్రరాజ! మహాసత్త సంస్కృతశ్చ మయావ్రజ॥
‘ఓ పక్షిరాజా! యజ్ఞయాగాది సత్కర్మలను ఆచరించేవారు, అయిదు అగ్నుల మధ్య ఘోర తపస్సు ఆచరించేవారు, సన్యాసాన్ని స్వీకరించి అరణ్యాలకు చేరినవారు, భూదానం, గోదానం మొదలైన దానాలు విస్తారంగా చేసినవారు ఏ ఉత్తమ లోకాలను పొందుతారో, అలాంటి సర్వోన్నత స్థానమైన వైకుంఠధామా న్ని నాతో బ్రహ్మమేధ సంస్కారం పొందిన నీవు.. నా అనుజ్ఞతో అనుగ్రహంతో పొందుతావు’ అని శ్రీరామచంద్రుడు జటాయువుతో చెబుతాడు.
దశరథ మహారాజుకు కూడా లభించని తర్పణాది సంస్కారం పొందే యోగ్యత జటాయువుకు దక్కింది. ‘దశరథ దురవాపం ప్రాపనైవాపమంభః’ అని భోజరాజు చంపూ రామాయణ గ్రంథంలో పేర్కొన్నాడు. వేదాంత శాస్ర్తాల్లో పేర్కొన్న రీతిలో ఉపాసనలు, వ్రతాలు, ఉపవాసాలు చేయలేకపోయినా పరమాత్మపై నిశ్చలమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉంటే, భగవంతుడి సేవలో పాల్గొంటే తప్పకుండా మోక్షార్హత లభిస్తుంది. జటాయువు వృత్తాంతం ద్వారా రామాయణం ఈ విషయం మనకు స్పష్టం చేస్తున్నది.
సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067