అసలు ఉచితాలంటే ఏమిటి? ఉచితాలంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు తన వద్ద ఉన్న డబ్బు, వస్తువులు ఇవ్వటం. ఉచితాలపై ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడెందుకు చర్చ జరుగుతున్నదో ఓసారి పరిశీలిద్దాం..
మోదీ ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ స్థితి మెరుగుపడే సూచనలు కనిపించకపోగా ఆర్థిక సంక్షోభానికి దారితీసే సంకేతాలున్నాయి. 2014లో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రూపాయి విలువ దారుణంగా పడిపోయి డాలర్తో పోల్చినప్పుడు రూ.80కి చేరింది. దేశంలో గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం ఎప్పుడు లేనివిధంగా 17 శాతానికి పెరిగిందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి దేశ ప్రజల ఆలోచనలను మళ్లించటానికి కేంద్రం చేపట్టిన కుట్రలో భాగమే ఉచితాలపై చర్చ.
దేశ ఆర్థికవ్యవస్థపై ఉచితాల వల్ల తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆర్బీఐ, ఉచితాలు తీవ్రరూపం చెందాయని కొంతమంది పెట్టుబడిదారీ వర్గాల మేధావులు మాట్లాడటం ఏ వర్గ ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవాలి. దళితబంధు, ఆసరా పింఛన్లు, ఆరోగ్యశ్రీ లాంటి వాటిపై మాట్లాడుతున్న మేధావులు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన దొంగల గురించి గాని, బ్యాంకు రుణాలు తీసుకొని అక్రమంగా లక్షల కోట్లు ప్రభుత్వం చేత మాఫీ చేయించుకున్న పారిశ్రామిక వేత్తల గురించి గాని ఎందుకు మాట్లాడటం లేదు. పేద ప్రజలు పొందే ఉచితాలు కానీ, సమాజంలో ఏర్పడిన నల్లధనం కానీ, పెట్టుబడిదారుల వద్ద పేరుకుపోయిన అక్రమ సంపద గాని, రాజకీయ నాయకుల వద్ద బందీగా ఉన్న ధనం గాని అంతా ఈ దేశంలోని 140 కోట్ల ప్రజానీకానిదే అనేది తిరుగులేని సత్యం.
పేదలు పొందే ఉచితాలపై చర్చిస్తున్న మేధావులు, దేశ విదేశీ పెట్టుబడిదారులు పొందుతున్న ఉచిత భూమి, ఉచిత కరెంటు, ఉచిత నీరు, సింగిల్విండో ద్వారా సకల సౌకర్యాలు ఇస్తున్న ఉచితాలపై ఎందుకు చర్చ చేయడం లేదు. ధనవంతులు పొందుతున్న ఉచితాలపై చర్చ చేయకుండా పేదలు పొందుతున్న ఉచితాలపై చర్చ జరిపి విస్తృత ప్రచారం చేసి, ఉచితాలు పొందని ప్రజలను ఉచితాలు పొందుతున్న వర్గాలపై దాడిచేయించే కుట్రలో భాగంగానే ఈ చర్చలని అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ, మేధావులు దేశ ఆర్థికవ్యవస్థపై ఆందోళన చెందాల్సింది పేదలు పొందుతున్న ఉచితాలపై కాదు. అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు కేవలం ఎనిమిదేండ్లలో లక్షల కోట్లు ఎలా సంపాదించారో, ప్రపంచ ధనవంతుల సరసన ఏ రకంగా చేరారో అనే అంశాలపై ఆందోళన చెందాలి. సమాజంలో పేదవానికి, ధనవంతునికి మధ్య ఎన్నడూ లేని విధంగా ఏర్పడుతున్న అగాధం గురించి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల్లో ఏర్పడుతున్న ఆర్థిక అసమానతల గురించి ఆందోళన చెందితే బాగుంటుంది.
కోర్టులు ఉచితాలపై స్పందిస్తూ, రాజకీయాలకు అతీతంగా చర్చించి మంచి సూచనలు చేయాలని చెప్పటం ఆహ్వానించదగిందే. కానీ ఉచితాలు ఎత్తివేయటం అనే ఆలోచనే రాజకీయమైనప్పుడు రాజకీయాలకు అతీతమైన చర్చ ఎలా సంభవం అవుతుంది? మద్యం వ్యాపారం ప్రభుత్వాల ఆదాయ వనరుగా ఎలా మారిపోయింది అని. ప్రజా సేవ చేయవల్సిన రాజకీయ నాయకులు విద్య, వైద్యం, మద్యం వ్యాపారాలు చేయటంపై చర్చ జరగాలి. వేల కోట్లు వెచ్చించి ఎన్నికల్లో గెలుస్తున్న రాజకీయ నాయకులకు ఉచిత వైద్యం, ఉచిత ప్రయాణం, పింఛన్లు వంటి సౌకర్యాలు కల్పించటం అవసరమా అనే చర్చ జరగాలి. కానీ, ప్రస్తుతం పేద ప్రజలు పొందుతున్న ఉచితాలపై చేస్తున్న ఎలాంటి చర్చ అయినా ‘ఉచితానుచితాలు’ మరిచి చేస్తున్నట్లుగానే భావించాలి.
వి.యస్.బోస్, 93913 56527
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్