ఒక్క బక్కపలచని మనిషికి ఇంతటి ఆత్మబలం ఎక్కడిది? ఆయన ఒక్క పిలుపునిస్తే దేశమంతా ఎట్లా కదిలింది? ఇప్పటిలా సమాచార, సాంకేతిక విస్ఫోటనాలు లేవు కదా? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు కదా? పైగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గాంధీకి అడుగడుగునా అడ్డుతగులుతున్న కాలమది. సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, సహాయ నిరాకరణోద్యమం సహా బ్రిటిష్ వారిని ఎదిరించే ఏ పోరాటంలోనూ తమ శ్రేణులు పాల్గొనకూడదని ఆ సంస్థ ఫత్వాలు జారీచేసిన జమానా కదా? మరెట్లా సాధ్యమైంది కోట్లాది భారతీయులను ఉద్యమంలోకి ఉరికించటం?!
-వజ్రోత్సవ విశ్లేషణ
ఎట్లా అంటే.. గాంధీజీ ఉపదేశం, ఆచరణ ఒక్కలాగానే ఉన్నాయి. లండన్లో బారిష్టర్ చేసిన, విక్టోరియన్ ఇంగ్లీష్ మాట్లాడే ఆయన ఎంత అధునాతనుడో.. మారుమూల భారతీయుల మనసు చూరగొనగలిగే సంప్రదాయ విలువలుగల సనాతనుడు కూడా! జైన మతం, భగవద్గీత నుంచి అహింస, నిష్కామకర్మ ఒడిసి పట్టుకున్నరు. లియో టాల్స్టాయ్, జాన్ రస్కిన్, డేవిడ్ థోర్ లాంటి వారి రచనలకు ప్రభావితమైన్రు. బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియని గుజరాతీ కవి రేచంద్ భాయ్ నుంచి ప్రేరణ పొందిన్రు. నరసి మెహతా అనే మరో గుజరాతీ కవి రాసిన భజనగీతం ‘వైష్ణవ జనతో’ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైనది. దేవుడు, మతం, సనాతన ధర్మం వైష్ణవులకు (మనిషికి అన్న అర్థంలో చదవండి) నేర్పే విలువల గురించిన గీతం అది.
అల్పులు, అనామకులు, అజ్ఞానులు, వాక్శుద్ధి, చిత్తశుద్ధి లేని నేటి బీజేపీ మంద తెలుసుకోవాల్సిన విషయమేమంటే ఆచారాలు పాటిస్తూనే, సాటి మానవులను ప్రేమించేవారే రామునికీ, రహీముకీ ఏకకాలంలో ప్రేమాస్పదులు కాగలరు. అందుకే ప్రపంచమంతా గాంధీని ప్రేమించింది. బ్రిటిష్ వారు సైతం గాంధీతో ‘ఒళ్ళు దగ్గరపెట్టుకుని’ మసిలిన్రు. ఇంతకూ ఏమిటా విలువ? ‘వైష్ణవ జనతో’ ఏమి చెప్పింది? వినండి.. ముఖ్యంగా మతాన్ని బూచిగా చూపి రాజకీయ లబ్ధి పొందాలనుకునేవారు; మతం అనగానే భయపడి పారిపోయి, సంస్కృతులను సైతం ఏవగించుకునేవారు.. వినండి!
‘… వైష్ణవులు అనబడే వారికి
ఇతరుల బాధలు తెలుస్తాయి
గర్వం తలకెక్కకుండా అందరికీ మంచి చేస్తారు
మొత్తం ప్రపంచం పట్ల సహనంతో ఉంటారు
ఇతరుల గురించి చెడు మాట మాట్లాడరు
వాగ్దానాలు, ఆచరణ, ఆలోచన సర్వం
పవిత్రంగా ఉంటాయి
వైష్ణవులు సర్వసమత భావనతో,
దురాశకు దూరంగా ఉంటారు
తమ తల్లి లాగే మహిళలు అందరినీ గౌరవిస్తారు
నాలుక చీల్చినా అసత్యం మాట్లాడరు
ఇతరుల సంపాదనకు ఆశ పడరు
వైష్ణవులు ప్రాపంచిక భోగలాలసులు కారు
కోపమూ, కోరికలూ త్యజించినవారు..’
vaishnav janato కోసం గూగుల్ లేదా యూట్యూబ్ చూడండి మిత్రులారా. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, రాధా విశ్వనాథన్, చంద్రకాంత్ పాఠక్, లతా మంగేష్కర్, కేఎస్ చిత్ర లాంటి ఎందరో గాయకులు పాడిన ఈ గీతం మీకు దొరుకుతుంది. మరి, నేడు రాముని పేరుతో వీరంగం వేసే మత పిచ్చిగాళ్లు నరసి మెహతా రాసిన, గాంధీ ఆచరించిన పై విలువల్లో ఒక్కదానికన్నా కట్టుబడి ఉన్నరా? ‘భగవద్గీత’ నుంచి అహింస అలవడింది అని చెప్పుకొని కృష్ణతత్వానికి ప్రాణం పెట్టిన గాంధీ ప్రాణం తీసిన గాడ్సే వారసులు ఒక్కరైనా సమాధానపడగలరా ‘వైష్ణవ జనతో’ విన్నంక?!
ప్రణామి హైందవ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన, కృష్ణ భక్తురాలైన తన తల్లి పుత్లీబాయి నుంచి భగవద్గీత, భాగవత పురాణం సహా వేదాలు, ఖురాన్లను నిబిడీకృతం చేసుకున్న 14 గ్రంథాల సారం నేర్చుకున్నరు గాంధీ. అది కదా తల్లి పట్ల గౌరవం అంటే? విలువలను స్వీకరించడం కదా ఎవరినైనా సరిగ్గా ప్రేమించడం అంటే?
లండన్ ‘ఇన్నర్ టెంపుల్’లో ‘లా’ చదివిన గాంధీ లోపలే ఒక దేవాలయం ఉన్నది.
అదే ఇన్నర్ టెంపుల్.. అంటే, అంతఃకరణ! కాబట్టే.. మాటా, పలుకూ, మనుగడా ఒక్కటిగా జీవించిన గాంధీ పిలుపునకు దేశమంతా కదిలింది. మరి, నేడు మన దొంగ విశ్వగురువు? దేశమైనా విదేశమైనా విదూషకుడిగానో, విద్వేషిగానో పేరు మోస్తున్నరు.
అమెరికా రాజకీయాల్లో వేలు పెట్టి అభాసుపాలు కాగలరు, శ్రీలంకలో కాంట్రాక్టులు ఇప్పించి పరువు తీయగలరు, కెనడాలో
‘ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్’కు వక్రభాష్యం
చెప్పి ఆల్జిబ్రాకే గుండె గాభరా తెప్పించగలరు! సగటు మనిషిగానే జీవించలేని ఈయన నుంచి గాంధీ చెప్పిన ‘వైష్ణవ జనతో’
విలువలేం ఆశించగలం మిత్రులారా!
45 ఏండ్ల వయసులో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీ మొదటి విజయం చంపారన్ సత్యాగ్రహం. నీలిమందు రైతులను ఆంగ్లేయుల దోపిడీ నుంచి కాపాడటం కోసం ఏడాదిపాటు నడిచిన ఈ ఉద్యమం విజయం సాధించి గాంధీ పేరు మార్మోగిపోయింది. నిన్న మొన్న సాగు చట్టాలను బలవంతంగా రుద్దబోయి బొక్కబోర్లా పడిన నరేంద్రమోదీ లాగే అప్పటి ఆంగ్లేయులూ తోక ముడిచిన్రు. ఉప్పుపై పన్ను వేసిన బ్రిటిష్ ప్రభుత్వంపై సత్యోగ్రరూపం దాల్చి గాంధీ ‘దండి’యాత్ర చేసిన్రు. మరి నేడు ‘దండి’ చైతన్యం లేశమాత్రమూ లేని గుజరాతీ మందబలం వికృత జీఎస్టీ రూపంలో విరుచుకుపడి భారతీయులను పన్నుల పేరుతో ‘దండి’స్తున్నది.
గ్రామాల్లోనే భారతదేశం ఆత్మ ఉన్నదని ప్రకటించిన గాంధీ.. కార్మికులు, కర్షకులు, కూలీల శ్రమను దోచుకుంటున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిరసించిన్రు. ఈస్టిండియా కంపెనీ రాకమునుపు ప్రపంచ జీడీపీలో 22 శాతంగా ఉన్న సుసంపన్న భారతదేశాన్ని పేదరికంలోకి నెట్టిన వలస పాలనపై తిరుగుబాటు రాజకీయ కోణంలో మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనను సైతం దెబ్బతీసిన పాలకులను తరిమివేయడానికి కూడా. తమ దైనందిన జీవితాలను విచ్ఛిన్నం చేసిన ఆంగ్లేయులపై గ్రామీణులను ఉరికించడంలో గాంధీ చూపిన చొరవ, తెగువ, వ్యూహం ఏ తరం నాయకులకైనా ఒక పాఠ్యాంశం! ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న ఖేడా ప్రాంత ప్రజల నుంచి పన్నులు వసూలు చేయరాదని సర్దార్ పటేల్తో కలిసి సత్యాగ్రహం చేసిన్రు గాంధీ. పన్నులు కట్టకపోతే భూములు జప్తు చేస్తామని వలస పాలకులు బెదిరించినా జడవక గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణలో పాల్గొన్నారు ప్రజలు. సంతకాల ఉద్యమం ద్వారా పాలకులను గడగడలాడించి తమ హక్కులు సాధించుకున్నరు. పన్నులు మాఫీ చేయించుకున్నరు. 1942 ఆగస్టు 8 నాటి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని పతాకస్థాయికి చేర్చింది. ఆ తర్వాత ఐదేండ్లకు మనం బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తమైనం. ఎన్నెన్నో దేశాల్లో పాఠ్యాంశంగా, ఎన్నెన్నో దేశాల్లో ప్రధాన కూడళ్ళలో నిలువెత్తు విగ్రహంగా, ఎందరెందరో ప్రపంచాధినేతల ఆదర్శ నాయకుడిగా వినుతికెక్కిన మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ యుగానికి ఒక్కడు! ఆయన వారసత్వం మనకు సగర్వకారణం! ఇలాంటి మనిషి ఈ భూమ్మీద రక్త మాంసాలతో నడయాడినారు అంటే భావితరాలు నమ్మలేని అద్భుతం అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. ఇపుడు ఐన్స్టీన్ ఆత్మ మరోసారి అనుకుంటూ ఉండవచ్చు ‘అలాంటి గడ్డ నుంచి నరేంద్ర మోదీ లాంటి మనిషి కూడా రాగలగడం భావితరాలకు మింగుడు పడని విషయం’ అని!
గాంధీని అత్యంత ప్రభావితం చేసిన రచనలివి: Ethical Religion (William Salter), On The Duty of Civil Disobedience (Henry Thoreau), The Kingdom of God Is With in You (LeoTolstoy), Un toThis Last (John Ruskin). నైతికమైన మత విశ్వాసాలు, సహాయ నిరాకరణ, అంతఃకరణలో దైవత్వం, సర్వసమత- ఎంత అద్భుతమైన, అవసరమైన తాత్వికత! అప్పటికీ, ఎప్పటికీ శిరోధార్యమైనవి కదా? నిజానికి మతం పేరుతో హైందవ విలువలకే శిలువ వేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో గాంధీ బోధనలే కాదు, గాంధీ నేర్చుకున్న బోధనల అవసరం కూడా ఎంతగానో ఉన్నది. అయితే, ఈ ఎరుక తమ కాళ్ల కింద నేలను తొలగించగలదని మోదీ- షా ద్వయానికి తెలుసు. కాబట్టే, గాంధీ పట్ల వ్యక్తిత్వ హననానికి తెగబడుతున్నరు.
అయినా వెరపు అవసరం లేదు, చదువరులారా! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వారసత్వం మనది. భవిష్యత్ను అందంగా తీర్చిదిద్దగలిగే వర్తమానంలోని సైనికులం మనం. చట్టాలను ఉల్లంఘించడం కూడా పోరాటరూపమే అని శాసనోల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం ద్వారా గాంధీజీ మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన్రు కదా? ఆయన పిలుపునందుకొని ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించుదాం. మొన్న సాగు చట్టాలకు, నిన్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమించినట్టు… జీఎస్టీపైనా ఉద్యమిద్దాం.సహాయ నిరాకరణ చేద్దాం.
ఒకవైపు తెలంగాణను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు సామాన్యుల కనీస అవసరాలపై పన్నులు బాదుతూ ఉంటే మనమెందుకు సహించాలి? ‘ప్రజాప్రయోజనార్థం జీఎస్టీ’ అని నాడు నమ్మబలికిన బీజేపీ ఇపుడు ప్రజల నమ్మకాన్ని విపణిలో సరుకుగా అమ్ముతుంటే మనమెందుకు నాటి మాట మీద నిలబడాలి? గోధుమపిండి, బియ్యం, పాలు పెరుగు సహా పిల్లలు వాడే పెన్సిల్స్, షార్ప్నర్లపై కూడా బాదిన జీఎస్టీ వల్ల ఆగ్రహోదగ్రులవుతున్న ప్రజలు కదిలేందుకు సిద్ధంగా ఉన్నరు. హక్కులపై ప్రజల స్పృహ 1922లో ఎంత నిజమో 2022లో కూడా అంతకంటే ఎక్కువ నిజం. If the truth shall kill them, let them die అంటారు ఇమ్యాన్యుయేల్ కాంట్. నిజం ఒక్కటే దేశద్రోహులను దగ్ధం చేయగలదు. ఆ నిజమే గాంధీయిజం!
నలుగురు గుజరాతీ రాబందులు దేశాన్ని దోచుకుంటూ ఉంటే, గాంధీ తెచ్చిన స్వాత్యంత్య్ర ఫలాలను దక్కనీయకుండా ఆ నలుగురే ఎదుగుతూ ఉంటే, ఊరుకుందామా? గాంధీ రాజకీయ ఆదర్శాలకు మూలమైన ‘సర్వోదయ’ మనకు పాఠం చెప్పడం లేదూ? జాన్ రస్కిన్ Unto This Last రాజకీయార్థికశాస్త్ర వ్యాసాలను ‘సర్వోదయ’గా మనకు అందించి ‘అందరూ ఎదగాలి’ అని ఉద్బోధించలేదూ? గాంధీ విరోధులకు శవాల మూటగా కనిపించే ఆ సాంస్కృతిక ఆయుధాలను ఈ విజయదశమికైనా మనం జమ్మిచెట్టు నుంచి కిందకు దించవద్దూ? దుర్మార్గ హస్తినాపురాధీశుల పీచమణచవద్దూ?
Do or Die. ఇపుడు కాకపోతే మరెపుడు? మనం కాకపోతే మరెవరు? అందుకే… ఆ మహాత్ముడిని అనుసరిద్దాం. త్రికరణశుద్ధిగా ప్రార్థిద్దాం.. ‘బాపూ… నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటన నడిచే బలమివ్వు’!
శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371