ప్రజల సంక్షేమం కోసం అహరహం ఆలోచించి నిరంతరం కృషి చేసిన వారిని ఈ నేల ఎల్లప్పుడూ తలపై పెట్టుకొని పూజించింది. ఒక సామ్రాట్ అశోకుడిలాగా, ఒక మహాత్మాగాంధీ లాగా..
‘విదేశాల్లో ఏమైనా అవకాశాలు దొరుకుతాయేమోనని ప్రతి రోజూ చూస్తున్నా. ఎందుకంటే మన దేశంలో ఇక మిగిలిందేమీ లేదు’- తాను ఎంతో ఇష్టపడే విద్యాధికుడైన ఒక యువ కార్యకర్త నిరాశతో ఈ మాటలు చెప్పినప్పుడు తనకెంతో బాధ కలిగిందని ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఇటీవల వెల్లడించారు. ఇది ఆ యువ కార్యకర్తకు మాత్రమే పరిమితమైన నిరాశ కాదు.. ఇది దేశమంతటా అలుముకున్న నిరాశ.
ఆకాశమంతా చిక్కటి, నల్లటి మబ్బులు కమ్ముకున్నట్లుగా ప్రస్తుతం మన దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక.. ఒకటేమిటి సమస్త రంగాలూ చీకటితో నిండి ఉన్నాయి. కారుమబ్బులను పారద్రోలే సూర్యుడి చండ ప్రచండ వెలుగు రేఖల కోసం పుడమి తల్లి ఎదురుచూసినట్లుగా భారతావనికి పట్టిన ఈ గ్రహణం నుంచి విముక్తి చేసే మహా నాయకుడి కోసం 140 కోట్ల మంది భారతీయులు.. రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల కార్యకర్తలు.. అందరూ ఎదురుచూస్తున్నారు.
నిజంగానే నరేంద్రమోదీ అంతటి అజేయుడా? నిజంగానే బీజేపీ అంతటి అభేద్యమైనదా? చరిత్రలో ఇటువంటి సంక్షోభాలు, సవాళ్లు, పరీక్షలు ఎన్నడూ ఎదురుకాలేదా? మన దేశం వాటిని ఎన్నడూ ఎదుర్కోలేదా?
అది 1970వ దశకం. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటానికి నాటి భారత ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ మద్దతిచ్చారు. మన సైన్యాన్ని పాక్ సేనల మీదికి పంపించారు. బంగ్లా యోధులతో కలిసి భారత సైన్యం అపూర్వమైన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది. స్వదేశంలో, విదేశాల్లో ఇందిర పేరు మార్మోగిపోయింది. కాంగ్రెస్ యావత్తూ ఆమె భజనలో మునిగిపోయింది. ఇందిరనే ఇండియా.. ఇండియానే ఇందిర అనే కాడికి వచ్చింది పరిస్థితి. అధికార మత్తులో మునిగిపోయిన ఇందిరాగాంధీ ఈ దేశాన్ని శాశ్వతంగా ఎలుతాననుకున్నారు.
ప్రతికూల పరిస్థితులు ఎదురుకావటంతో 1975లో ఎమర్జెన్సీ విధిం చి, దేశాన్ని ఉక్కు పిడికిట బంధించారు. ఆ సమయం లో ఎవరూ కూడా ఇందిర నుంచి భారతదేశం విముక్తి చెందుతుందని అనుకోలేదు. మరో 25-30 ఏండ్లు భారత్ ఇందిర పాలనలోనే ఉంటుందనుకున్నా రు. కానీ, ఈ నిరంకుశత్వాన్ని భారతదేశం సహించలేదు. ఎదురుతిరిగింది. ఎమర్జెన్సీ కొనసాగుతున్న దశలోనే 1977లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇందిర చిత్తుగా ఓడిపోయారు. భారతదేశం తన సుసంపన్నమైన జాతీయోద్యమ విలువలను తిరిగి ప్రతిష్టించుకున్నది.
1984లో ఇందిర హత్య అనంతరం దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంతటి మెజారిటీని సాధించి అధికారం చేపట్టింది. ఇందిర వారసుడిగా రాజీవ్గాంధీ ప్రధాని అయ్యారు. మరో రెండు మూడు దఫాలైనా రాజీవ్ హవా కొనసాగుతుందని రాజకీయ పండితులు ఊహాగానాలు వెలువరించారు. కానీ, ఐదేండ్లలోనే రాజీవ్ సత్తా ఏమిటో దేశం చూసింది. 1989 ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి పండితుల అంచనాలను తలకిందులు చేసింది. భారతదేశం తనను తాను నిరూపించుకున్న మరో చారిత్రక ఘట్టం ఇది.
1999లో అటల్ బిహారీ వాజపేయీ మూడోసారి అధికారం చేపట్టారు. అంతకుముందే జరిగిన పో ఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఆయన ఇమేజీ బాగా పెరిగిపోయింది. వాజపేయి ఇప్పట్లో ప్రధాని పదవి నుంచి దిగిపోరన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్డీఏ అభేద్యంగా కనిపించింది.
ఇదే అదనుగా, విద్య తదితర రంగాల్లో తమదైన వివాదాస్పద అజెండాను అమలు చేయటం ప్రారంభించింది. ప్రతిపక్షం బలహీనమైన స్థితిలో ఉంది. వాజపేయి-అద్వానీ ద్వయానికి ఇక ఎదురులేదన్న పరిస్థితి నెలకొంది. కానీ, ప్రజలు తమదైన తీర్పును మరోసారి వెలువరించారు. 2004 ఎన్నికల్లో ఎన్డీఏ పరాజయం మూటగట్టుకుంది.
వేల సంవత్సరాల సముజ్వల చరిత్ర గలిగిన ఈ దేశం ఎన్నడూ ఒక నాయకుడి ముందు దాసోహం కాలేదు. అది ప్రాచీన కాలంలోనైనా.. ఆధునిక కాలంలోనైనా. ప్రజల్ని కలుపుకొని పోయి, ప్రజల సంక్షేమం కోసం అహరహం ఆలోచించి వారి కోసం నిరంతరం కృషి చేసిన వారిని ఈ నేల ఎల్లప్పుడూ తలపై పెట్టుకొని పూజించింది. ఒక సామ్రాట్ అశోకుడిలాగా, ఒక మహాత్మాగాంధీ లాగా. ప్రజలు ఇచ్చిన అధికారం అంతా తన స్వశక్తితో సాధించుకున్నానని భావించి, భ్రమల్లో బ్రతుకుతూ, సర్వశక్తిమంతుడిగా ఊహించుకున్న వాళ్లకు ఈ దేశం మర్చిపోలేని గుణపాఠాలనూ అంతే ఒడుపుగా నేర్పించింది. ఒక ఔరంగజేబు, ఒక ఇందిరాగాంధీ లాగా. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా భారతదేశం ఎన్నడూ నిద్రాణంగా లేదు. చరిత్ర విసిరే సవాళ్లకు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నది. ఇండియా రియాక్ట్స్. అదే ఈ దేశం ఆత్మ. శరీరానికి ఆది అంతాలు ఉన్నట్లుగా ఆత్మకు ఉండవని, అది శాశ్వతం, నిరంతరమని వేదాంతులు, తత్వవేత్తలు చెప్పారు. అలాగే, ఈ దేశాన్ని పాలించే వ్యక్తుల అధికారానికి ఆది అంతాలు ఉండవచ్చు. కానీ, భారతదేశ ఆత్మ శాశ్వతం, నిరంతరం, ప్రాచీనం, ఆధునికం.
నేడు 75 ఏండ్ల వయస్సులో భారత రిపబ్లిక్ ఒక పెను సవాల్ను ఎదుర్కొంటున్నది. దీనిని ఇండియా ఎలా ఎదుర్కొనబోతున్నది, ఎలా అధిగమిస్తుంది అని యావత్ ప్రపంచం ఆసక్తితో గమనిస్తున్నది. రాళ్ల రాపిడిలో నిప్పు పుట్టినట్లుగా ఈ రాపిడి నుంచే ఒక కొత్త నవోదయాన్ని దేశం ప్రసవిస్తుంది. ఆ నవశకం వైపు భారత్ను తీసుకువెళ్లే మహా నాయకుడు ఇప్పు డు అవసరం.
ఆ నాయకత్వం దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరాశను తొలగించి కొత్త ఆశలను నెలకొల్పాలి. బీజేపీ వద్ద, మోదీ వద్ద కుప్పలు తెప్పలుగా ధనరాశులున్నాయి, కండబలం, మీడియా బలం, అధికార బలం ఉంది.. ప్రత్యామ్నాయం సాధ్యమా? అని సగటు పౌరుల నుంచి మేధావుల వరకూ, ప్రతిపక్షాల నుంచి సామాజిక కార్యకర్తల వరకూ అందరి మదిలో ఉన్న ప్రశ్న. నిజానికి మోదీ బలం కన్నా ఆ బలాన్ని అత్యధికంగా ఊహించుకుంటూ నిరాశలోకి కూరుకుపోతున్న వాతావరణం ప్రస్తుతం నెలకొన్నది. ఇది కూడా మోదీ, బీజేపీ సృష్టించిన మాయాజాలమే. దీనిని ప్రప్రథమంగా పారద్రోలాలి. మోదీ వద్ద ఇన్ని బలాలు ఉండగానే ఈ దేశ రైతాంగం ఆయన చేత క్షమాపణ చెప్పించి, వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయించిందన్న జ్ఞాపకం జనంలో గుర్తుండేలా చేయాలి. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్బాగ్ ఉద్యమం సృష్టించిన చరిత్రను, ఆ చట్టాన్ని మోదీ సర్కారు పక్కనపెట్టిన సంగతిని గుర్తు చేయాలి. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఢిల్లీ వంటి పలు రాష్ర్టాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని ప్రజల మదిలో నాటుకునేలా చేయాలి. ఈ విధంగా దేశంలో నిరాశను పారద్రోలటంతో ప్రారంభించి పాజిటివ్ పాలిటిక్స్కు అంకురార్పణ చేయాలి.
పాజిటివ్ పాలిటిక్స్ అంటేనే నెగెటివిటీని అధిగమించటం. మోదీని విమర్శించటం, ఆయన చేసే ప్రతి పనినీ ఎద్దేవా చేయటం పాజిటివ్ పాలిటిక్స్ కిందికి రాదు. ఈ విధమైన నిందారోపణల వల్ల మోదీయే కేంద్రంగా మారుతుంటారు. జనానికి విసుగొస్తుంది. కాబట్టి, ప్రజలకు మోదీ ఇవ్వజూపుతున్న దానికన్నా మెరుగైన ఎజెండాను అందించాలి. కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ విఫలమయ్యారు. ఆకస్మిక లాక్డౌన్, విదేశాలకు టీకాల ఎగుమతి వంటి ఆయన నిర్ణయాలతో దేశం అతలాకుతలమైంది. అది వాస్తవం. కానీ, కేవలం నిందిస్తే ప్రయోజనం ఉండదు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను సమూలంగా మార్చి, కరోనా వంటి అనుకోని విపత్తులు వస్తే ఎదుర్కోగలిగే వైద్య ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం కోసం అవసరమైన బ్లూప్రింట్ను ప్రజల ముందు పెట్టాలి.
నేటి ప్రజానీకం వర్తమానంలో జీవిస్తున్నారు. వారికి సుదూరమైన గతంగానీ, సుదూరమైన భవిష్యత్తుగానీ అంత ఆసక్తి కలిగించటం లేదు. కాబట్టి, కొత్త నాయకత్వం ప్రజల తక్షణ ఆకాంక్షలకు అద్దం పట్టాలి. వారి జీవితాల్ని మెరుగుపరిచే ప్రణాళికలను అది కూడా ప్రాక్టికల్గా సాధ్యమయ్యే రీతిలో రూపొందించాలి. వాటిపై చర్చ పెట్టాలి.
ఈ దేశంలో 60 వేల టీఎంసీలకుపైగా నీళ్లు అం దుబాటులో ఉంటే వాటిలో సగం కూడా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? వాటిని ఉపయోగించుకుంటే దేశం ఏ విధంగా మారిపోతుంది? అన్న కేసీఆర్ ప్రశ్న ఈ కోవకు చెందినదే. మన తర్వాత స్వాతంత్య్రాన్ని సాధించుకున్న చైనా మనను దాటిపోయి ప్రపంచశక్తిగా ఎలా ఎదిగింది? మనమూ ఎదుగవద్దా? అన్న ప్రశ్న ప్రజల్ని ఆలోచింపజేసేదే. ఈ విధమైన కొత్త ఆలోచనల నుంచే కొత్త ఎజెండాల్ని సృష్టించాలి. మోదీ బలం అంతా కూడా.. ఆయన తనవైన ఎజెండాలు సృష్టించి ప్రజల మీదికి, పార్టీల మీదికి వదలటంలో ఉంది. అయోధ్య, కశ్మీర్ ఫైల్స్, ఉమ్మడి పౌరస్మృతి, మథుర, కాశీ… వీటి మీద అనుకూల, వ్యతిరేక చర్చలతోనే సమయం గడిచిపోతున్నది. కేంద్రంగా మాత్రం మోదీనే కొనసాగుతున్నారు. ఈ దేశాన్ని నవ్యమార్గాన తీసుకెళ్లే నాయకత్వం ఈ ట్రాప్లో పడిపోవద్దు. ప్రజలు కేంద్రంగా, రాజ్యాంగ విలువలు కేంద్రంగా కొత్త ఎజెండాలను సృష్టించాలి. వాటిపై మోదీ, బీజేపీ స్పందించకతప్పని, జవాబు ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపిస్తుంది.
నేడు 75 ఏండ్ల వయస్సులో భారత రిపబ్లిక్ ఒక పెను సవాల్ను ఎదుర్కొంటున్నది. దీనిని ఇండియా ఎలా ఎదుర్కొనబోతుంది, ఎలా అధిగమిస్తుంది అని యావత్ ప్రపంచం ఆసక్తితో గమనిస్తున్నది. రాళ్లు రాజుకుంటే నిప్పు పుట్టినట్లుగా ఈ రాపిడి నుంచే ఒక కొత్త నవోదయాన్ని దేశం ప్రసవిస్తుంది. ఆ నవశకం వైపు భారత్ను తీసుకువెళ్లే మహా నాయకుడు ఇప్పుడు అవసరం.
ఇక బీజేపీ, మోదీ బ్రహ్మాస్తంగా భావిస్తున్న హిందూ మతం అంశాన్ని.. ఈ దేశ సుసంపన్నమైన, వైవిధ్యపూరితమైన, మత, సాంస్కృతిక వారసత్వంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నిజానికి, ఈ వారసత్వ సంపద ముందు బీజేపీ మత బాణం ఎందుకూ కొరగాదు. వేల ఏండ్లుగా ఈ దేశం ఎటువంటి ఆలోచనధారను కలిగి ఉంది. బౌద్ధం, జైనం, హైందవం నుంచి క్రైస్తవం, ఇస్లాం, సిక్కు వరకూ అన్నింటిలోని మంచిని ఇముడ్చుకుంటూ భారతీయ సంస్కృతి ఎలా పరిణమిస్తూ వచ్చింది అన్నది ప్రజలకు తెలియాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయత అర్థమవుతుంది. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా మత రాజకీయాలు ఊసులో లేకుండా పోతాయి.
దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను, విలువలను కాపాడుకునే క్రమంలో అన్ని సిద్ధాంతాలు, అన్ని విశ్వాసాలకు సంబంధించిన వారిని కలుపుకొనిపోవాలి. ఒక్కటే లక్ష్యం.. ఒక్కటే ఆశయం. భారతదేశాన్ని కాపాడుకోవాలి. భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఒకటిగా నిలుపాలి. ప్రపంచ యవనికపై మన దేశం తలెత్తుకొని నిలబడాలి.
బీజేపీ వద్ద, మోదీ వద్ద కుప్పలు తెప్పలుగా ధనరాశులున్నాయి, కండ బలం, మీడియా బలం, అధికార బలం ఉంది.. ప్రత్యామ్నాయం సాధ్యమా? అని సగటు పౌరుల నుంచి మేధావుల వరకూ, ప్రతిపక్షాల నుంచి సామాజిక కార్యకర్తల వరకూ అందరి మదిలో ఉన్న ప్రశ్న. నిజానికి మోదీ బలం కన్నా ఆ బలాన్ని అత్యధికంగా ఊహించుకుంటూ నిరాశలోకి కూరుకుపోతున్న వాతావరణం ప్రస్తుతం నెలకొన్నది. ఇది కూడా మోదీ, బీజేపీ సృష్టించిన మాయాజాలమే. దీనిని ప్రప్రథమంగా పారద్రోలాలి. మోదీ వద్ద ఇన్ని బలాలు ఉండగానే ఈ దేశ రైతాంగం ఆయన చేత క్షమాపణ చెప్పించి, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయించిందన్న జ్ఞాపకం జనంలో గుర్తుండేలా చేయాలి.
కె.వి.రవికుమార్