2019 డిసెంబర్, చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ను గుర్తించిన అనతికాలంలోనే ఆ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. యావత్ ప్రపంచాన్ని గజగజా వణికించింది. కరోనా వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశమైన భారత ప్రజలకు కరోనా వైరస్ కంటే అతిభయంకరమైన వైరస్ బీజేపీ రూపంలో పొంచి ఉన్నది. 2014 నుంచి రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మళ్లీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది.
మహిళల అక్రమ రవాణా, సంస్కృతీ సంప్రదాయాలు, లైంగికేతర హింస, ఆరోగ్య పరిరక్షణ, వివక్ష లాంటి అంశాలపై ఒక సంస్థ సర్వే చేపట్టినప్పుడు ప్రపంచంలోని ఐదు దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమైనవని తేలింది. ఆఫ్ఘనిస్థాన్, కాంగో, పాకిస్థాన్లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, లైంగిక హింస, మహిళల అక్రమ రవాణా, ఆరోగ్య పరిరక్షణ పాటించక పోవటం (ప్రసవ మరణాలు, వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం, హెచ్ఐవీ ఎయిడ్స్)లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. లైంగికేతర హింస, వివక్ష అంశాల్లో సోమాలియా ఐదో స్థానంలో ఉన్నది. ఇదే సంస్థ 2018లో మహిళలకు ప్రమాదకరమైన దేశాల సర్వేను పది స్థానాలకు పెంచి నిర్వహించగా ఆఫ్ఘనిస్థాన్ రెండో స్థానంలో ఉండగా, సోమాలియా నాలుగో స్థానంలో ఉన్నది. కాంగో ఏడో స్థానంలో, పాకిస్థాన్ అరో స్థానంలో ఉన్నాయి. టాప్-5 దేశాల్లో సిరియా మూడో స్థానం, సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉంటే భారత్ మాత్రం అగ్రస్థానంలో ఉన్నది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోనీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు తీవ్రస్థాయిలో పెరిగాయని ఆ సంస్థ పేర్కొన్నది. 2020తో పోల్చితే దాదాపు 20 శాతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగినట్టు ‘జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన 2021 ‘క్రైమ్ ఇన్ ఇండియా’ నివేదికలో సైతం తెలిపింది. 2020లో 28,046 అత్యాచార కేసులు నమోదు కాగా, 2021లో 31,677 నమోదయ్యాయి. మహిళలపై రోజుకు సగటున 86 అత్యాచారాలు, ప్రతి గంటకు 49 కేసులు నమోదవుతున్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది.
దేశవ్యాప్తంగా 2021లో మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 4,28,278 కేసులు నమోదు కాగా అందులో 56,083 కేసులు బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో జరగడం సిగ్గుచేటు. మహిళలపై నేరాలలో సంఖ్యాపరంగా అసోం రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. సాక్షాత్తు దేశ ప్రధాని స్వరాష్ట్రం అయిన గుజరాత్లో ‘బిల్కిస్ బానో’ అనే ఐదు నెలల గర్భిణీపై 11 మంది మానవ మృగాలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిని క్షమాభిక్ష పేరుతో విడుదల చేయడమే కాకుండా నీతిమంతులు, సంస్కారవంతులని బీజేపీ నాయకులు మద్దతు తెలుపడం అత్యంత హేయనీయం. దీన్నిబట్టే మహిళలపై, మహిళా భద్రతపై బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
టెక్నాలజీతో పాటు విద్యను నమ్మిన అనేక ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలుగా మారుతున్నాయి. కానీ, మూఢనమ్మకాలు, మతం మత్తులో మగ్గిపోతూ భారత్ మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది. దేశ ప్రజలను, యువతను మతం మత్తులో ముంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదిలాగే కొనసాగితే గుండు పిన్నీస్ నుంచి విమానాల దాకా భారతదేశంలోనే తయారు కావాలన్న ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
2016లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యమని చెప్పిన ప్రధాన మోదీ… అన్నట్లుగానే పేద రైతులైన అదానీ, అంబానీల ఆదాయాన్ని రెట్టింపు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 5లో ఉండేలా చేశారు. ప్రభుత్వరంగంలో తప్ప ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు లేనందున ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం వల్ల సులువుగా రిజర్వేషన్లను పూర్తిగా తొలగించవచ్చునని భావించారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తూ రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎన్నిక ఏదైనా బీజేపీ పేరుతో ఓట్లు అడగడానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలి. నిత్యావసరాలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్లచట్టాల వంటి అంశాలపై ప్రశ్నలడగాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుల ఆదాయాలు, వ్యాపారసంస్థల ఆదాయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ, పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు.
కాబట్టి సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే పార్టీలను, నాయకులను ‘ఓటు’ అనే ఆయుధంతో తిరస్కరించాలి. ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే పార్టీ దేశంలో బీజేపీ ఒక్కటే. కరోనా వైరస్ వలె తీవ్రనష్టం చేయకముందే దేశంలో బీజేపీని అంతమొందించాలి.
(వ్యాసకర్త: సోషియాలజిస్ట్)
మాణిక్ డోంగ్రె