నవ భారతాన్ని సాకారం చేస్తామని పలు పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. ఎన్నికల రణ క్షేత్రంలో హోరెత్తించే వాగ్దానాలు, నినాదాలతో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకుని గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తున్నాయి. ఈ తతంగాన్ని ఆలోచనాపరులైన భారతీయులు గమనిస్తూనే ఉన్నారు. విజ్ఞత,దూర దృష్టి కలిగిన నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
భౌతిక సంపద వృద్ధిలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, దేశ జీవనాడి అయిన వ్యవసాయ రంగంలో, విద్య, వైద్య రంగాల్లో మనం కొంత ప్రగతి సాధించాము. అయినప్పటికీ మన తర్వాత స్వాతంత్య్రం సాధించిన కొన్ని దేశాలు సంక్షేమం, అభివృద్ధిలో మన కంటే ఎన్నో రెట్లు ముందున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల తలసరి ఆదాయం నేటికీ తక్కువగా ఉందనేది చేదు నిజం. దీనికి కారణాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. నాయకుల్లో లోపించిన దూర దృష్టి, మానవ, సహజ వనరుల వినియోగంపై అవగాహన రాహిత్యం మూలంగా గ్రామీణులు, పేదల జీవన ప్రమాణాల్లో పెద్ద మార్పులు రాలేదు. నేటికీ అనేక రాష్ర్టాల్లో దారిద్య్రం తాండవించే పల్లెలు ఉన్నాయి.
చట్ట సభలకు ఎన్నికైన నాయకులు ప్రజా సంక్షేమమే పరమావధిగా కాకుండా తమ రాజకీయ భవితవ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత ప్రలోభాల వెల్లువలో మునిగి దేశాభివృద్ధికి పుష్కలంగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశం దీన స్థితిలో కొట్టు మిట్టాడుతున్నది. దేశ విభజన నేపథ్యంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు, సరిహద్దుల్లో ఎడతెరిపి లేని శత్రురాజ్యాల ఆగడాలు, పొరుగు దేశాలతో సామాజిక సంబంధాలు నెలకొల్పడంలో అనేక కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. దీనివల్ల దేశాభివృద్ధిలో ఆశించిన ఫలితాలు రాలేదు.
ముఖ్యంగా నేటి కేంద్ర ప్రభుత్వ పాలకుల్లో రాజ్యాంగ స్ఫూర్తి లోపించింది. వివిధ రాష్ర్టాల్లో రాజ్యాధికారమే పరమ లక్ష్యంగా భావిస్తున్న బీజేపీ, ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కి ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను కర్కశంగా కూల్చుతున్నది. అక్రమంగా నాయకులను వ్యక్తిగత ప్రలోభాల్లో ముంచెత్తి అధికారాన్ని తమ పార్టీకి బదలాయించుకుంటున్నది. ఆటవికంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నది. రాజ్యాంగంలోని సమాఖ్య భావనకు తూట్లు పొడిచి రాష్ర్టాల హక్కులకు తూట్లు పొడుస్తున్నది. నియంతృత్వ ధోరణిలో ఏకపక్షంగా సాగుతున్నది. విజ్ఞత గల భారత జాతి ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నది.
భారత్ విభిన్న మతాలకు నిలయం. మత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని నీరుగార్చి మత రాజ్య స్థాపనకై తపిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విష బీజాలు నాటుతున్నది. వివిధ వర్గాల ప్రజల మధ్య విభజనను ప్రోత్సహిస్తున్నది. దేశ భవితవ్య పునాదులపై ప్రమాద ఘంటికలను ఉచ్ఛ స్వరంలో మోగిస్తున్నది.
ఇలాంటి దీనమైన దుస్థితిలో ఒక వెలుగు రేఖ ఆశా కిరణంలా ప్రభవించించింది. రాజ్యాంగ పరిధిలో ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని దేశ ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మొలిచిన ఒక అత్యద్భుత భావి భారత భవితవ్య సంక్షేమ ప్రణాళిక… బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భావం. మేరా భారత్ మహాన్.
దేశానికి వ్యక్తులు ప్రధానం కాదు, ఆదర్శాలే ముఖ్యం. అద్భుతమైన ఆలోచనలు దేశానికి దిశా నిర్దేశం చేయగలవు. విజ్ఞులైన భారతీయుల విచక్షణ జయాపజయాలను నిర్ణయిస్తుంది. జై తెలంగాణ! జై భారత్!!
కె.లక్ష్మణ్ గౌడ్
97049 30509