మునుగోడు ఎన్నికల్లో మునిగేది ఎవరు? తేలేది ఎవరు? అని రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సందర్భం.ఓటు మాకే వేయాలంటే, మాకే వేయాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠలు, కీలక రాజకీయ మలుపుల మధ్య నిజాల్ని అబద్ధాలుగా, అసత్యాలను సత్యాలుగా చేసే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ మునుగోడు నియోజకవర్గంలో ఏ బజారులో చూసినా, ఏ వీధిలో చూసినా కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయాల్లో ఎవరికి ఓటు వేయాలి? అన్నది నిర్ణయించుకునే ముందు ఏ పార్టీ మునుగోడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిందో తెలుసుకోవాలి. నల్గొండ జిల్లాలో, మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ భూతం ఎన్ని రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టిందో, ఆ ప్రాంతానికి ఎంత నరకం చూపిందో, మనుషుల్లోని జవజీవాలను, మట్టిలోని సారాన్ని పీల్చేసుకొని ఎందరు మనుషుల ప్రాణాలను గుంజిందో, పంటలను చంపిందో.. విముక్తి ఎప్పుడని కాలమే కళ్లల్లో వొత్తులేసుకొని ఎదురుచూసిందో కదా! నల్గొండ జిల్లాలో నీళ్లందని దుక్కులు, గుక్కెడు నీళ్లు దొరకక గొంతెండిన వైనాలు ఎన్నెన్నో. మంచి నీళ్ల కోసం మూడు నాలుగు రోజులు ఎదురుచూసి ఊరంతా వంతులవారీగా బిందెలతో క్యూలు కట్టిన దృశ్యాలెన్నో కదా. మనిషి రూపంలో ఉండి అవయవాలన్నీ దెబ్బ తిని, పళ్ళు గార బట్టి, దేహాలు వంకర్లు కొంకర్లు తిరిగిపోయి అంగవైకల్యాలతో జీవితాంతం అల్లాడుతూ ఎత్తు పెరగక మరుగుజ్జులుగా మారిపోయిన దుఃఖ గాథలు ఎన్నెన్నో. ఆ కన్నీటి కథలను దినపత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి ప్రపంచం నివ్వెరపోయింది కానీ ఆనాటి పాలకులు మాత్రం కనికరం చూపలేదు.
అటు ప్రకాశం, ఇటు నల్లగొండ జిల్లాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరోసిస్ నిండి ఉన్న ప్రాంతాలని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. జలసాధన సమితి ఉద్భవించింది. దుశ్చర్ల సత్యనారాయణ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి జల ఉద్యమ సాధకుడై సాగాడు. డాక్టర్ రాజారెడ్డి లాంటి సామాజిక వైద్యులు ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు వచ్చి తపన పడ్డారు.
ఫ్లోరోసిస్ విషాన్ని పారద్రోలి గంగమ్మను ఈ నేల మీద ప్రవహింపజేసే పరమశివుని కోసం ఈ ప్రాంతం ఎదురుచూసింది. దశాబ్దాల తరబడి కృంగి కృశించిపోయిన ఈ దుర్భిక్ష ప్రాంతాలపైన నాటి నాయకులు కుప్పలు తెప్పలుగా ఓట్ల కోసం, సీట్ల కోసం వాగ్దానాల వర్షాలు కురిపించారు. కానీ సమస్యలను పరిష్కరించలేదు. ఈ అత్యాధునిక గ్లోబల్, మహా గొప్ప ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితిని మునుగోడు ప్రాంతం ఎదుర్కొంది. ఆ నాయకులు అప్పుడేం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఒక్కసారి మననం చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర చేసుకుంటూ నల్లగొండ జిల్లాకు, మునుగోడు ప్రాం తానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధలను చూసి కన్నీరు మున్నీరైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘చూడు చూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ’ అంటూ దుఃఖంతో స్వ యంగా పాట రాశాడు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుంటేనే ఫ్లోరోసిస్కు విరుగుడు అని గర్జించాడు.
కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ఈ తరం యువతరం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. మీ వూరి వాళ్లు మంచి వయసులో కుక్కి మంచంలో పడి ఎందుకు నవిసిండ్రో, పంటలు పండక, మంచినీళ్లు కూడా దొరకక మన తల్లులు కోసుళ్ల కొద్ది నడిచి కన్నీళ్లతో ఎట్లా కాలం వెళ్లదీశారో ఈ తరం తెలుసుకోవాలి. ప్రపంచ చరిత్ర, దేశ చరిత్ర, దేశ దేశాల పోరాటాలను పరీక్షల కోసం చదవడం మాత్రమే కాదు. నీ ఊరి చరిత్రను నీ ప్రాంత చరిత్రను ఒక్కసారి వెనుతిరిగి 40 ఏండ్లుగా, నీళ్ల కోసం, సరైన వైద్యం కోసం తమ బిడ్డలకు మంచి చదువు కోసం మన అయ్యలు, అమ్మలు, తాతలు, ముత్తాతలు ఎంతెంత ఇబ్బందులు పడ్డరో, ఈనాటి ఒక మంచి స్థితి కోసం అదే నేలలో ఎన్నెన్ని పోరాటాలు చేశారో ఓ యువకులారా!! ఓ నవతరం శక్తులారా!! ఒక్కసారి మీ వూరి చరిత్రను మీరు తెలుసుకోండి. మీ పూర్వీకులు పడ్డ బాధలు చూడండి. మీ వూర్లలో ఇప్పటికీ కనిపిస్తున్న అమరుల స్తూపాలను చూడండి. వాళ్లెందుకు ఈ నేల కోసం పోరాడారో? ఎందుకు అసువులు బాసారో? వాళ్లు ఏం కలలు కన్నారో? ఒక్కసారి తెలుసుకోండి. మీ వూర్లలో గత నాలుగు దశాబ్దాల క్రితం పరిస్థితులు ఎట్లుండె? మీ వూర్లో పెద్దలనడిగి సమగ్రంగా విషయాలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీకు వాస్తవాలు తెలుస్తాయి.
ఆనాడు మన వూర్లలో అవ్వలు, అయ్యలు ఎందుకు మహత్తర వీర తెలంగాణ పోరాటంలోకి దూకారో తెలుస్తది. ఆనాడు 1969 తొలి దశ పోరాటం, 2001 ఏప్రిల్ 27 నుంచి ఒక మహోద్యమంగా కదిలిన మలిదశ పోరాటాలలో తమ తమ వూర్లల్లో ఏం జరిగిందో ఈ తరం తప్పక తెలుసుకొని తీరాలి. ఈ అధ్యయనాలు లేకపోతే నీళ్ల కోసం మునుగోడు ఎట్లా కన్నీళ్లు పెట్టుకుందో తెలియదు. ఇప్పుడు మీ ఇళ్ల ముందుకు, మీ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఎట్లా వచ్చాయో తెలుసుకోవాలంటే చరిత్ర పేజీలు తిరగేయాలి. మిషన్ కాకతీయతో మీ వూరి చెరువులెట్లా నిండాయో చూడటమే కాకుండా ఇదే చెరువును కాస్త కాలాన్ని వెనక్కి జరిపి చూస్తే ఎండి నెర్రెలు బారి తుమ్మలతోపుగా కనిపిస్తది. ఈ మార్పును గమనించాలి. లేకపోతే ఇప్పుడు ఓట్ల కోసం ఏది బడితే అది మాట్లాడే వాళ్ల మాటలే నిజమనుకుంటారు. కులం పేరుతో మతం పేరుతో అబద్ధాలనే ప్రచారం చేసి రెచ్చగొట్టే కుల మత శక్తుల మాటలనే నమ్ముతరు. మార్పు కోసం నిలిచిన వారిని మరిపించి మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టే వారి నుంచి సమాజాన్ని రక్షించుకోవాలంటే యువ శక్తులే ఈ పనికి పూనుకోవాలి.
మిషన్ భగీరథ మన చౌటుప్పల్ నుంచే ఎందుకు మొదలైంది అన్నది అవగతం చేసుకోవాలి. మన మునుగోడు నుంచి మొదలైన మిషన్ భగీరథ పథకం తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లలాగా ఎట్లా మారిందో అవగాహన చేసుకోకపోతే మార్కెట్లో సరుకుల్లాగా అమ్ముతున్న అబద్ధాలే నిజం అనుకునే ప్రమాదం ఉంది. మొదట సమాజాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ)
జూలూరు
గౌరీశంకర్