మాంఝా..: నెల జీతగాడు. బీహార్ల మాంఝాకు జాతకం కలిసొస్తలేదని పెండ్లాం, ముగ్గురు పిల్లలు, ముల్లె, మూట సర్దుకొని మన తెలంగాణకొచ్చి దగ్గెర దగ్గెర ఐదారేండ్లయితున్నది. ‘మాంఝా’ మాంచి డ్రైవర్. మాంఝా భాయ్ కారు రొప్పుతుంటే నేను, ఓ పెద్దమనిషి (సింగ్ జీ) ఆ కార్ల గూసున్నం.
మొన్నటైతారం: మా తొవ్వ బండ్లగూడ కాంచెల్లి మొయినాబాద్, చేవెళ్ల మీదికెల్లి అనంతగిరి కొండలల్ల కొలువైన పద్మనాభస్వామి గుడికాడికి సాగుతున్నది. గుడి ముందటికి వొయ్యి పక్కకు కనవడ్తున్న దుక్నం కాడికి పోయిన. గుండ్రటి టోపీ పెట్టుకున్న ఓ ముసల్మాన్ దుక్నంలనే అటీ టు తిరుగుకుంట ‘క్యా చాహియే బేటా..’ అని ఇంటికొచ్చిన సుట్టాలను అర్సుకున్నట్టు అడిగిండు. ‘పానీ హోనా జీ’ అన్న. ఫ్రిజ్లకెల్లి తీసి నీళ్ల బాటిల్ ఇచ్చిండు. ‘పైసల్ ఎంత అని అడిగిచ్చిన. పక్కకున్న హోటళ్ల చాయ తాగేముందు ఆ నీళ్లు తాగినం.
ఓ ఇరువై నిమిషాల తర్వాత..: ‘ఆప్ ఖావో పెహ్లే.. బాద్మే నిఖాలో గాడీ’ అంటే దబదబా పులిహోరా, లడ్డూ తిని కార్దీసిండు మాంఝా భాయ్. కారు ముందుకు వోతాం టే అనంతగిరి అడవులు ఎన్కకువోతనే ఉన్న యి. ఏదో మిస్సయితున్న ఫీలింగ్. నాతో కార్లున్న సింగ్ జీ ముచ్చట షురూ జేయనే జేసిండు. ‘అనంతగిరి అడవులకు ఓ మాయ ఉన్నది తెలుసా సతీష్!’. ‘తెల్వదు సార్’ అన్న. చరిత్ర చెప్పిండు. అక్కడ దొరికే స్వచ్ఛమైన గాలి కోసం పక్క రాష్ర్టాలకెల్లి మనుషులొస్తరని, ఎన్కట ఏం రోగమొచ్చినా అనంతగిరి అడవులకొచ్చి నెలల కమాన ఉంటుండె అని జెప్పవట్టిండు. ‘అనంతగిరి కీ హవా, లాఖో బీమారియా దవా!’ అని శాత్రమే వుట్టింది. అనంతగిరి అడవులు దాటంగనే ఘాట్ రోడ్డు. ఆ ఘాట్రోడ్డు మీద కొద్దిసేపాగి పోట్వలు దిగినం. కింద ఉన్న కీరెళ్లి మొకాన సూత్తే మొత్తం పచ్చగనే.. మాంఝా భాయ్ మళ్లా కార్దీసిండు. ప్రకృతి ఎంత స్వచ్ఛంగ ఉం టది. స్వచ్ఛత కోసం ఎతుక్కోవలసిన పరిస్థితి!
మాంఝా భాయ్ కారును కేరెళ్లి, ధారూర్, మన్సాన్పల్లి, మందాపూర్, కందనెల్లి మీదుగా తాండూర్లోని సయ్యద్ ఖాదర్ భాషా ఇంటికి తీస్కవోతున్నడు. తాండూర్కు కర్ణాటక బార్డర్ తొమ్మిది కిలో మీటర్ల దూరంల ఉంటది. ఖాదర్ భాయ్ నలభై ఏండ్ల కిందట పక్క రాష్ట్రంల నుంచి తాండూర్కు వచ్చి ఇక్కన్నే ఇల్లు కట్టుకున్నడు.
ఘాట్రోడ్డు మీంచి కారు దిగుతాంటే పచ్చని అడవితల్లి తన ఒడిలో లాలించినట్టే అనిపిచ్చింది. కిందికి దిగి ధారూర్ దగ్గర్కి వోయినంక సూత్తే అవి మొత్తం ఎర్రరేగడి భూములు. ఆ భూములను సూత్తే పుట్టమన్ను మతికొచ్చింది. నా సిన్నతనంల సీసీ రోడ్లెక్కడియి. ఇప్పుడంటే ఊరూరా సీసీ రోడ్లేనాయె. నాడు బతుకమ్మల అడుగును ఈ పుట్టమన్నుతోనే అల్కుతుండె.
మాంఝా భాయ్ కారును కేరెళ్లి, ధారూర్, మన్సాన్పల్లి, మందాపూర్, కందనెల్లి మీదుగా తాండూర్లోని సయ్యద్ ఖాదర్ భాషా ఇంటి కి తీస్కవోతున్నడు. తాండూర్కు కర్ణాటక బార్డర్ తొమ్మిది కిలో మీటర్ల దూరంల ఉం టది. ఖాదర్ భాషా నలభై ఏండ్ల కిందట పక్క రాష్ట్రంల నుంచి తాండూర్కు వచ్చి ఇక్కన్నే ఇల్లు కట్టుకున్నడు. భార్య, కొడుకు, కోడలు, ఇద్దరు మనుమండ్లతోని సంబురంగుంటున్నడు. కారు ఇంటిముందు ఆగిందో లేదో.. ‘ఆయియే సింగ్ జీ.. ఆయియే..’ అనుకుంటా మా కాళ్లకు నీళ్లిచ్చిండు ఖాదర్ భాయ్. లుంగీ కట్టుకొని బనీన్ మీదున్న ఖాదర్భాయ్ మెడల బంగారు గొలుసు తళతళా మెరుస్తున్న ది.
గొలుసు మెరువడం పక్కనవెడితే ఆ గొలుసుకు హనుమాన్ బిళ్లున్నది. ఆ బిళ్ల నన్ను మస్తు పరేషాన్ జేసింది. కాళ్లు కడుక్కొని ఇంట్ల వొయ్యి కూసున్నం. ఓ గోడకు ఉర్దూల ఏదో రాసి ఉన్నది (నాకు ఉర్దూ రాదు). ఇంకో దిక్కేమో సెల్పుల నర్సింహస్వామి దేవుని బొమ్మ, ఆ బొమ్మకు ఎదురుంగ ఊదుబ త్తీలు అంటిచ్చి ఉన్నయి. మేం సోఫాల కూసుంటే, మోకాళ్ల ముందున్న టేబుల్ మీద ఒగలు కాళ్ల షోర్వ (పాయ) తీస్కచ్చిపెట్టిర్రు. ఇంకొగలేమో జవారీ రోటీ కట్ట వెట్టిర్రు. వాళ్ల సిన్న మనుమడు చిట్టి చేతులతోటి నీళ్ల గిలాస తీస్కచ్చిండు. నేను ఆ బొమ్మల దిక్కే సూస్తు న్న. అది పసిగట్టిన ఖాదర్భాయ్..
‘మేం ముస్లింలమే. అయినా మేం అన్ని దేవుళ్లకు మొక్కుతం’ అని రోటీ నములుకుంట జెప్పవట్టిండు. ఖాదర్భాయ్ ఏటా యాదగిరి గుట్టకు గూడా వోతడట. ‘కరోనా అచ్చినకాన్నుంచి పోలేదు, ఈ మజ్జనోసారి గుట్టకు వొయ్యి నర్సింహ స్వామిని దర్శనం చేసుకోవాల్నని’ నాతో అన్నడు.
రోటీ తిన్నంక కొద్దిసేపు కూసున్నం. ఐదు నిమిషాల తర్వాత ఇల్లు తిరిగి సూత్తే మోకాళ్ల కిందేస్కొని నమా జు చేస్కుంటున్న సాప కనవడ్డది. అదే ఇంట్ల దేవున్ని లేపేందుకు కొట్టే గంట గూడ కనవడ్డది.
2022, సెప్టెంబర్ 29: గురువారం పొద్దుగాల ఎనిమిది గొట్టంగ ఖాదర్ భాయ్ నుంచి ఫోనొచ్చింది. ఫోనెత్తి ‘నమస్తే ఖాదర్ భాయ్’ అంటే ‘నమస్తే సతీష్.. గుట్టకు రాక మూణ్నాలుగేండ్లాయెనే.. ఎంతమంచిగైందే యాదగిరిగుట్ట ఇప్పుడు. ఫోన్లు వట్కపోనియ్యలే గని లేకుంటేనా మంచి, మంచి పోట్వలు తీసి నీకు వాట్సప్ జేత్తును’ అని దర్శనం మంచిగైందనే ముచ్చట జెప్పిండు. ఒక్కసారిగా నాకు ఖాదర్భాయ్ మెడల ఉండే హనుమాన్ బిళ్ల కండ్ల ల్ల మెరిసింది.
గడ్డం సతీష్
99590 59041