(నేటి అలంకారం: లలితా త్రిపుర సుందరీదేవి)
శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఐదో అలంకారం లలితా త్రిపుర సుందరీ దేవి. లలిత అంటే లావణ్యం అని, త్రిపుర సుందరి అంటే ఆనందం కలిగించేది అని అర్థం. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు. ఈ త్రిపురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగించి, అమ్మ తన సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరీదేవిగా విలసిల్లుతుంది. లలితాదేవి నెలవంకను కిరీటంగా ధరించి, పై రెండు చేతుల్లో పాశం, అంకుశం, కింది రెండుచేతుల్లో చరక బిందు, అలాగే ఐదు పూల బాణాలు ధరించి ఉంటుంది.
లోక కల్యాణం కోసం దేవతల కోరిక మేరకు, చిదగ్ని కుండం నుంచి లలితాదేవి ఉద్భవించింది. ఆమె ఆవిర్భవించడానికి ముందు ఒక దివ్య తేజస్సు దర్శనమిచ్చింది. ఆ తర్వాత లలితాదేవి సాక్షాత్కరించగానే వేయి సూర్యుల ప్రకాశం ఆ ప్రాంతమంతా ఆవరించిందట. అమ్మవారి స్వరూప, స్వభావాలు అనన్య సామాన్యం. ఆమె సౌందర్యం లోకోత్తరమైనది. వశిని, కాళిని, జయిని, మోదిని, అరుణ, విమల, సర్వేశ్వరి, కామేశ్వరి అనే పేర్లు కలిగిన వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి సన్నిధానంలో ఉండి ఆమెను అర్చిస్తూ ఉంటారు. ‘ల కార రూపా లలితా! లక్ష్మీవాణీ నిసేవితా!’- అంటే లక్ష్మీ, సరస్వతులు సేవించే లలితాదేవిని ఈ నవరాత్రుల్లో ఐదో రోజున వివిధ ఉపచారాలతో అర్చిస్తారు. వివిధ స్తోత్రాలతో, సహస్ర నామాలతో స్తుతిస్తారు. ప్రసాదాలను నివేదిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తుల హృదయాల్లోని అజ్ఞాన తిమిరాలు తొలగిపోతాయి. శ్రీ లలితాదేవి దివ్యలీలలు, సౌందర్య వైభవాలు ఆమెకు సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే దర్శించగలుగుతారు.
ఆ తల్లి శ్రీ చరణ సన్నిధిలో కొలువుదీరిన దేవతలు పరస్పర సంభాషణలతో అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. ఆమె దర్శనాన్ని హయగ్రీవుడు కూడా పొందగలిగాడు. వశిన్యాది వాగ్దేవతల దర్శనాన్ని, హయగ్రీవుడి సందర్శనాన్ని బ్రహ్మాండ పురాణం ఆధారంగా వ్యాసమహర్షి లలితా సహస్రనామ స్తోత్రం పేరుతో మానవాళికి అనుగ్రహించాడు. ఇందులో అమ్మవారి మాతృప్రేమను, అందులోని మాధుర్యాన్ని ఆవిష్కరించాడు. విశ్వసామ్రాజ్య పాలనాభారాన్ని నిర్వహించే తల్లి శ్రీ లలితాదేవి. ఎవరెవరికి ఏ విధమైన ఆహార పానీయాలను అందించి, పోషణ చేయాలో, వారికి ఎలా రక్షణ కల్పించాలో… ఆ విధమైన పద్ధతుల్లో అనుగ్రహిస్తుంది లలితాదేవి.
– వేదార్థం మధుసూదనశర్మ