భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండేది. కానీ నేడు ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి మారక విలువ డాలర్తో పోలిస్తే గణనీయంగా పతనమవుతున్నది. మూడు దశాబ్దాల కిందట ఒక డాలర్ రూ. 21 పలికేది. కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అది కాస్త రూ.63కి చేరింది. నేడు ఒక్క డాలర్ ఏకంగా రూ.81 స్థాయిని చేరి ఎప్పుడూ లేని స్థాయికి క్షీణించింది.
భారత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగ వృద్ధిలో మందగమనం ప్రారంభమైనది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి చర్యలు ఆర్థికరంగం జోరుకు కళ్లెం వేశాయి. అదే సమయంలో కరోనా విజృంభించి దేశ ఆర్థికాన్ని అధఃపాతాళానికి నెట్టింది.
దేశీయంగా స్టాక్ మార్కెట్లో భారీ పతనం, ఎఫ్డీఐలు తరలిపోవడం, విదేశీ మారక నిల్వల్లో తగ్గుదల, వాణిజ్య లోటు పెరుగుదల మొదలైన పరిణామాలకు రూపాయి పతనం దారితీస్తున్నది. ఇది రూపాయి చరిత్రలోనే ఆల్ టైం కనిష్ఠం కావడం గమనార్హం. ఇలాగే పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తే మహా మాంద్యానికి చేరువ కావడం ఖాయం అనిపిస్తున్నది.
భారత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వృద్ధిలో మందగమనం ప్రారంభమైనది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి చర్యలు ఆర్థికరంగం జోరుకు కళ్లెం వేశాయి. అదే సమయంలో కరోనా విజృంభించి దేశ ఆర్థికాన్ని అధఃపాతాళానికి నెట్టింది. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత కుంగదీసింది. దీంతో ధరలు పెరిగి సామాన్యుని జీవనం పెనుభారంగా మారింది. అధిక ద్రవ్యోల్బణంతో ఏం కొందామన్నా, ఏం తిందామన్నా భరించలేని భారమైంది.
అన్నిరకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి చుక్కలనంటుతున్నాయి. దీంతోపాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. తినలేం, తిరగలేం, ఇల్లు కట్టలేం, అద్దెకుండలేం అన్నట్లు తయారైంది సామాన్యుడి పరిస్థితి. అంతేకాదు మూడేండ్లలో స్టీల్, సిమెంట్, ఇసుక ధరలు 50 శాతం పెరిగాయి. స్కూలు, కళాశాలల ఫీజులు, పాలు, పండ్లు, పప్పు, ఉప్పు, బియ్యం, నూనెలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ప్రజల బతుకులు గాలిలో దీపంగా మారాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
ధరల భారంతో పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అవసరమైన బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. రెండు నెలల కిందట క్వింటాల్ బియ్యం ధర రూ.4200 ఉండేది. నేడు జీఎంటీ బియ్యం రూ.5200, బీపీటీ రూ.3600 నుంచి రూ.4,500, జైశ్రీరామ్ వెరైటీ రూ.4,400 నుంచి రూ.6,000లకు పెరిగింది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని బియ్యం వ్యాపారులు సిండికేట్గా మారి మార్కెట్ను శాసిస్తున్నారు.
వంటనూనెలు మార్చిలో లీటర్ ధర రూ.133 గా ఉండేది. మే నాటికి రూ.195 నుంచి రూ.200లకు చేరింది. ప్రస్తుతం కొంత తగ్గినప్పటికీ ఇంకా తగ్గాల్సి ఉన్నది. అలాగే కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రాకముందు వంట గ్యాస్ ధర రూ.410 ఉండేది. ప్రస్తుతం అది రూ.1200కు చేరింది. గ్యాస్ సిలిండర్ ధర కొన్నాళ్లుగా అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఇది చాలదన్నట్లు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా గ్యాస్ రాయితీని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నామమాత్రం గా రూ.40లు మాత్రమే రాయితీ ఇస్తున్నది.
ప్రైవేట్ పాఠశాలలు స్కూల్ ఫీజులను 50 శాతం వరకు పెంచాయి. ఫీజులు కట్టలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ల పిల్లలను చేర్పిస్తున్నారు. దీనికి తోడు పుస్తకాలు, ఆటో, బస్సుచార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి. అలాగే నిర్మాణభారం కూడా పెరిగింది. మూడేండ్ల కిందట ప్రతి చదరపు అడుగుకు రూ.1000 ఉండగా, అదిప్పుడు రూ.1600 కు చేరింది. 50 కిలోల సిమెంట్ బస్తా ధర అప్పట్లో రూ.250 ఉంటే నేడు రూ. 360కి చేరింది. టన్ను ఇసుక ధర రూ.2500 నుంచి రూ.4000 చేరింది. టన్ను స్టీల్ ధర రూ.32,000 నుంచి రూ.69,000లకు చేరిం ది. మేస్త్రీలు, రోజువారీ కూలీల ధరలు గణనీయంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ఇండ్ల కిరాయిలు కూడా గణనీయంగా పెరిగాయి.
‘గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్న ట్లు’గా కష్టాన్ని నమ్మి బతుకుతున్న పేద ప్రజ లు తమ మౌలిక అవసరాలు తీరక అప్పుల పాలవుతున్నారు. ధరల విజృంభణతో బతు కు బండి అమాంతం తలకిందులై సాధారణ జనం అల్లాడిపోతున్నారు. ధరల స్థిరత్వంపై ఆర్బీఐ, ద్రవ్య క్రమశిక్షణపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాల్సి ఉన్నది. పతనమైన రూపాయి బలపడాలంటే.. వస్తు ఉత్పత్తి, సేవల రంగా ల్లో మన దేశం అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలి.
విదేశీ చెల్లింపులకు సంబంధించి మిగులు స్థాయిలోనే దిగుమతుల జాబితాను కనిష్ఠ స్థాయికి కుదించాలి. ఈ ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని, ఉపాధి లేమిని సాధ్యమైనంత మేర నియంత్రించాలి. ఏటా వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వంటనూనెలు, ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి. రూపా యి క్షీణతతో పెరిగే రుణభారం మన దేశానికి ఆర్థికపరంగా ఎంతమాత్రం క్షేమం కాదు. రూపాయి విలువ బలపడితేనే మన దేశ ఆర్థి కరంగం కోలుకుంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రతికూలతలు, ప్రతిబంధకాలను అధిగమిస్తూ ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ, ప్రణాళికబద్ధ కార్యాచరణను చేపట్టాలి. నిపుణుల సూచన మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
‘గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్లు’గా కష్టాన్ని నమ్మి బతుకుతున్న పేద ప్రజలు కనీసం అవసరాలు తీరక అప్పుల పాలవుతున్నారు. ధరల విజృంభణతో బతుకు బండి అమాంతం తలకిందులై సాధారణ జనం అల్లాడిపోతున్నారు. ధరల స్థిరత్వంపై ఆర్బీఐ, ద్రవ్య క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉన్నది. పతనమైన రూపాయి బలపడాలంటే.. వస్తు ఉత్పత్తి, సేవల రంగాల్లో మన దేశం అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలి.
మేకిరి దామోదర్
95736 66650