ప్రభుత్వరంగ అధీనంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, విద్యుత్రంగ సంస్థలు, గనులు తదితర సంపదనంతా తమకు నచ్చిన కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుండటం వివాదాస్పదమవుతున్నది. ఈ నేపథ్యంలోనే, ఆస్తులు అప్రతిహతంగా పెరిగిపోయి అనతికాలంలోనే ప్రపంచ కుబేరుల్లో అదానీ అగ్రస్థానానికి దూసుకువెళ్లారు. విద్యుత్రంగంలో కేంద్రం తీసుకురాదలచిన సంస్కరణలు కూడా అదానీకి మేలు చేయటానికే అన్న విమర్శలున్నాయి. ప్రజలు, రైతులు, ఉద్యోగులు.. అన్నివర్గాల్లోనూ దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’, ఈ మధ్యకాలంలో బొగ్గు, ఇంధన మంత్రిత్వశాఖలు ఇచ్చిన ఆదేశాలు ఏ రకంగా ప్రజా వ్యతిరేకమైనవో ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుత నెట్వర్క్ను వాడుకుంటూ వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ప్రభుత్వ డిస్కంల పాత్ర నామమాత్రం అవడమే కాకుండా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య, వ్యాపారవర్గాలు ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అందరికీ విద్యుత్తు అందించే బాధ్యత ప్రభుత్వ డిస్కంలపైనే ఉండటం వల్ల పేద, వ్యవసాయవర్గాలు మాత్రమే మిగిలిపోతారు. 100 కిలో వాట్లకు పైబడిన ఎల్టీ వినియోగదారులు కూడా ఓపెన్ యాక్సెస్ పరిధిలోకి వెళ్లిపోవడం ప్రైవేట్ ఆపరేటర్లకు మేలు చేయడం కోసమే. ‘ఏరియా’ అన్న పదం గురించి చట్టంలో నిర్వచించకపోవడం పెద్దకుట్ర. ధనికులు ఉండే ప్రాంతాలను, వాణి జ్య, వ్యాపార, పారిశ్రామిక వాడలను ఏరియాలుగా ఆదేశించే ప్రమాదం పొంచి ఉన్నది.
విద్యుత్ సవరణ బిల్లులో ఉన్న ‘రెన్యూవబల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్’ భారీ పెట్టుబడులు పెడుతున్న సౌర విద్యుత్ ఉత్పత్తిదారుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండ టం గమనార్హం. ఆయా రాష్ర్టాలలోని సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా డిస్కంలు పునరుత్పాదక విద్యుతును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంలో భాగంగా 2030 వరకు దేశంలో కేంద్రం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 500 గిగావాట్లుగా నిర్దేశించింది. ఈ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా థర్మల్ విద్యుత్తును ఉపసంహరించుకోవడానికి 2022 మే 26న మార్గదర్శకాలు జారీ చేసింది. 2025-26 నాటికి 58 వేల మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవడానికి వీలుగా థర్మల్ విద్యుత్ కేంద్రాల పీఎల్ఎఫ్ను 40 నుంచి 45 శాతానికి కుదించింది. ఆ మేరకు విద్యుత్ కేంద్రాలను బ్యాక్డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో నడిపినప్పుడు ఎఫీషియన్సీ తగ్గిపోయి యూనిట్ విలువ పెరిగిపోతుంది. పగలే సౌరవిద్యుత్ అందుబాటులోఉంటుంది. సాయంత్రం పీక్ అవర్స్, ఉదయం పీక్ అవర్స్ డిమాండ్ను తట్టుకోవడానికి తిరిగి సంప్రదాయ విద్యుత్పైనే ఆధారపడాలి. జనరేటర్లకు చెల్లించాల్సిన స్థిరచార్జీలు దీనికి అదనం. వీటిని తట్టుకోవడానికి కేంద్రం చేయూతనివ్వదు.
అదానీకి సౌర విద్యుత్తులో 20,500 మెగావాట్లు, థర్మల్ విద్యుత్లో 13,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్నది. అదానీ ఎనర్జీ రాబోయే కాలంలో పునరుత్పాదక రంగంలో 70 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకెళ్తున్నది. ఇందుకు కావల్సిన భూమికను కేంద్రం చేసి పెడుతున్నట్లుగా తీవ్ర ఆరోపణలున్నాయి. గత మే 2న భారత్, జర్మనీల మధ్య పునరుత్పాదక విద్యుత్రంగంలో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులకు ద్వైపాక్షిక ఒప్పం దం జరిగింది. ఇది అదానీకి లాభాలు చేకూర్చడానికేనన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ప్రధాని నరేంద్రమోదీ ఒప్పందం తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలాంటి ప్రశ్నలకు వారిద్దరూ జవాబులివ్వకపోవడం గమనార్హం.
సంబంధిత రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్ను పరిగణనలోకి తీసుకొని ఆయా రాష్ర్టాల విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్లు ఆదేశాలివ్వడం పరిపాటి. సవరణ చట్టం కార్యరూపం దాల్చితే పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల లక్ష్యాలను కేంద్ర రెగ్యులేటరీ కమీషన్ ఏకపక్షంగా నిర్ణయించడమే కాకుండా ఉల్లంఘించిన డిస్కంలకు భారీ ఎత్తున పెనాల్టీలను విధిస్తుంది. అల్ట్రా మెగా సౌర విద్యుత్ కేంద్రాలు కలిగి ఉన్న బడా పెట్టుబడిదారులైన అదానీ లాంటి వారికి లబ్ధి చేకూర్చడమే ఆర్పీఓ ప్రధాన ఉద్దేశం. జర్మనీ తదితర దేశాల నుంచి భారీ పెట్టుబడులు అందుకుంటున్న అదానీ సంస్థలకు కేంద్రమే గ్యారంటీలు ఇస్తుండటం విశేషం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ఇండియన్ పవర్ ఎక్చ్సేంజీ’ నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్ క్రయవిక్రయాలు జరపరాదని ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీస్ లేకుండా ఏకపక్ష ఆదేశాలివ్వడం సంచలనమైంది. రూ.1360 కోట్ల బకాయిలున్నట్లు పేర్కొన్న కేంద్రం తప్పుడు ప్రకటన ఇచ్చి అనంతరం ఎలాంటి బకాయిలు లేవన్నట్లు పేర్కొని పునరుద్ధరణ ఉత్తర్వులు ఇచ్చింది. అసలు జరిగిన విషయం ఏమంటే అదానీ ఎనర్జీకి డిస్కంలు బకాయిలున్నట్లు చెప్తున్న ఏడు కోట్ల వివాదాస్పద బకాయిల నిమిత్తమే అంత కఠినమైన ఆదేశాలిచ్చినట్లు తేలింది.
కర్బన ఉద్గారాలను 2050 నాటికి జీరోస్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న కేంద్రం మరోపక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలలో 10 శాతం అంటే సుమారు 38 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును విధిగా ఉపయోగించాలనే నిబంధన పెట్టడం కేవలం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రంలో అదానీకి చెందిన కార్మైఖేల్ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మార్గం సుగమం చేయడంలో భాగమే. వివాదాస్పద కార్మైఖేల్ బొగ్గు గనులు డిసెంబర్ 2021 నుంచే ఉత్పత్తి ప్రారంభించగా వాటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 10 మిలియన్ టన్నులు. భవిష్యత్తులో 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా అది మన సింగరేణి ఉత్పత్తితో సమానం. టన్ను 4 వేలకు దొరికే దేశీయ బొగ్గును కాదని రూ.24 వేలకు టన్ను బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఎన్టీపీసీ, కోల్ ఇండియా లిమిటెడ్, ఏపీ తదితర రాష్ర్టాలు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసుకొని బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి.
కర్బన ఉద్గారాలను నియంత్రిస్తూ కాలుష్యరహిత వాతావరణం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్న కేంద్రం అదానీ సంస్థకు జార్ఖండ్లో ‘గొడ్డ’ థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుమతులివ్వగా పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ విద్యుత్ కేంద్రానికి అదానీకే చెందిన ఆస్ట్రేలియాలోని కార్మైఖేల్ బొగ్గు గనుల బొగ్గును ఒడిశాలోని ధమ్రాపోర్టు ద్వారా గొడ్డ రైల్వేస్టేషన్కు తరలిస్తారు. బొగ్గు గనులు, పోర్టు, రోడ్డు మార్గం, విద్యుత్ కేంద్రం అన్నీ అదానీకి సంబంధించినవే. ఇంతచేసి 2800= 1600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న గొడ్డ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ మనకోసం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ 70 శాతానికి పైగా పనులు పూర్తిచేసుకున్న ఈహెచ్టీ లైన్ల ద్వారా విద్యుత్ను బంగ్లాదేశ్కు అమ్ముకుంటారు. అంటే భూములు మనవి, కాలుష్యం మనకు విద్యుత్ బంగ్లాదేశ్కు. లాభాలేమో అదానీకి అన్నమాట.
పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయడానికి తెలంగాణ జెన్కోలు, సింగరేణి జైపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం కలగలిపి 1,937 మెగావాట్ల థర్మల్ విద్యుత్ను, 3,730 మిలియన్ యూనిట్లు బ్యాక్డౌన్ చేసుకోవాల్సిందిగా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ ఒత్తిడి మేరకే శ్రీలంకలో మన్నార్, పూనేరిన్లలో 520 మెగావాట్లకు సంబంధించిన 500 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీకి కేటాయించినట్లు సలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఫెర్నినాండో ఆ దేశ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట వాంగ్మూలం ఇవ్వడంతో శ్రీలంకలోని ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో మన దేశ ప్రతిష్ఠకు భంగం కలుగగా విద్యుత్రంగంలో వస్తున్న నూతన చట్టాలు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న పలు ఆదేశాలు రైతులు, పేద ప్రజలు, విద్యుత్రంగ ఉద్యోగుల పట్ల శాపంగా పరిణమించనున్నాయి.
(వ్యాసకర్త: అధ్యక్షులు, టీఎస్ఎస్పీడీసీఎల్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్)
తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313