(నేటి అలంకారం: అన్నపూర్ణాదేవి)
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం. అందరికీ అన్నం పెట్టి, ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నుంచే జీవులన్నీ పుడుతున్నాయి. పుట్టిన జీవులన్నీ అన్నం (ఆహారం) వల్లే వృద్ధిని పొందుతున్నాయి. అందరికీ అన్నమే ప్రధానం అని తైత్తిరీయ ఉపనిషత్ చెబుతున్నది. జీవుల మనుగడకు ఆధారమైన అన్నాన్ని పూర్ణంగా కలిగి, అందరి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి.
మోక్షాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వారణాసిలో పరమశివుడు విశ్వేశ్వరుడిగా కొలువుదీరాడు. పార్వతీదేవి అన్నపూర్ణగా వెలిసింది. ఒకానొక కాలంలో పార్వతీదేవి.. పరమేశ్వరుడి కండ్లు మూయగా, లోకాలన్నీ చీకటిలో కూరుకుపోయాయట. తప్పును తెలుసుకున్న పార్వతీ ప్రాయశ్చిత్తాన్ని కోరగా.. కాశీలోని ప్రజల ఆకలి తీర్చమన్నాడట శివు డు. కరువుతో కటకటలాడుతున్న ప్రజలకు అన్నాన్ని అందించి వారి ఆకలి తీర్చిందట పార్వతి. నాటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా పూజలు అందుకుంటున్నదని ప్రచారంలో ఉన్నది.
సాక్షాత్తూ పరమశివుడికే భిక్షను వేసిన తల్లి అన్నపూర్ణ. ‘అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్’- అన్నాన్ని నిందించరాదని, చిన్నచూపు చూడకూడదని, అన్నమే ప్రాణమని తైత్తిరీయ ఉపనిషత్ వాక్యం. ఒక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ‘ఈ ప్రపంచమంతా అన్నంతో సహా అంతా మిథ్య (మాయ)’ అని అన్నాడట. ప్రకృతి స్వరూపమైన పార్వతీదేవికి ఆ మాటలు నచ్చక, ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నిటినీ అదృశ్యం చేసిందట. ఆహారం లేక ప్రజలందరూ ఆకలితో అలమటించారు. ప్రేమ స్వరూపిణి అయిన పార్వతీదేవి మళ్లీ అందరికీ అన్నాన్ని ప్రసాదించి ఆకలి తీర్చిందట. అన్నం ప్రాధాన్యాన్ని గుర్తించి పరమశివుడు కూడా భిక్షాపాత్రను చేతబూని స్వయంగా అమ్మవారిని భిక్ష అడిగాడట. అన్నపూర్ణగా అమ్మవారిని కొలిచే వారికి ధనధాన్య సంపదలతోపాటు ఉన్నతగతి కూడా కలుగుతుంది.
‘అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకరః ప్రాణవల్లభే!
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి!’ అని భిక్షను కోరుతూ అమ్మను స్తుతించారు ఆదిశంకరాచార్యులు. ఇలాంటి మహిమాన్వితమైన అన్నపూర్ణాదేవిని భక్తులు యథాశక్తిగా కొలచి ధనధాన్య సంపదలు పొందుదురు గాక!
– దోర్బల కుమారస్వామి