అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్లుగా- కుట్రలు, కువిమర్శలు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని దాచిపెట్టలేవు. ఆర్బీఐ తాజా నివేదిక ఈ సత్యాన్ని నిరూపించింది. ఐదేండ్ల వ్యవధిలో వ్యవసాయరంగంలో తెలంగాణ రెట్టింపు ప్రగతిని నమోదు చేసిందని, దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ‘భారత ఆర్థికవ్యవస్థ గణాంకాల హ్యాండ్బుక్-2020-21’లో వెల్లడించింది. స్థానిక బీజేపీ నాయకులు మొదలుకొని రాష్ర్టానికి వచ్చిన కేంద్రంలోని పెద్దల వరకు అందరూ అదే పనిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ ఉంటారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వ శాఖలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, ఇతరత్రా అధ్యయన బృందాలు తెలంగాణ ప్రగతిని తమ గణాంకాల ద్వారా ఆకాశానికెత్తుతుంటాయి.
2017లో తెలంగాణ 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయగా, గత ఏడాదికి అది వందశాతం పెరిగి 1.23 లక్షల టన్నులకు చేరుకున్నది. పత్తి ఉత్పత్తి ఆరు వేల మెట్రిక్ టన్నుల నుంచి 34 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. మొత్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఐదేండ్లలో 94 వేల మెట్రిక్ టన్నుల నుంచి 1.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వ్యవసాయంతోపాటు అటవీ, మత్స్య రంగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ విజయాల పరిధి ఎంత విస్తృతమైనదో అవగతమవుతుంది. ఈ మూడు రంగాల నికర విలువ 2017-18లో రూ.95,098 కోట్లు కాగా 2021-22కి రూ.1,81,702 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. అంటే ఐదేండ్లలో ఈ మూడు రంగాలు రూ.86,604 కోట్ల సంపదను సృష్టించాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో సంపద సృష్టికి వేదిక కాలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రణాళిక వేసి, వాటిని నిర్దేశిత గడువులో అమలుచేశారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ వంటి కీలకరంగాలకు పెద్ద పీట వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల శంకుస్థాపనను, ప్రారంభాన్ని ఒకే జీవితకాలంలో చూడటం అరుదు. కానీ రాష్ట్రం అవతరించిన తర్వాత కేసీఆర్ పాలనలో అది కండ్లారా చూశాం. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీయటం కూడా దీనికి తోడైంది. వీటివల్ల ఆయకట్టు విస్తరించడంతోపాటు భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. జనాభాలో అత్యధికులకు ఆధారంగా ఉన్న వ్యవసాయరంగ స్వరూపం సమూలంగా మారిపోయింది. సాగు తర్వాత అధిక సంఖ్యలో ప్రజలు ఆధారపడిన కులవృత్తులకు ప్రభుత్వం చేయూతనివ్వడం వల్ల గ్రామీణ రంగం సుసంపన్నమైంది. మొదట్లో ఈ విధానంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ, ఆర్బీఐ వంటి అత్యున్నత సంస్థలు మత్స్యరంగంలో తెలంగాణ సాధించిన విజయాల్ని వేనోళ్ల పొగడటం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.