డెబ్బయి అయిదు ఏండ్ల స్వతంత్రభారతం ఇపుడు, రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి, సుస్థిరంగా పాలిస్తూ, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లగల ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సామరస్యం, నవీనమైన ఆలోచనలు ఈ సరికొత్త అభ్యుదయ వాహనానికి నాలుగు చక్రాలు కావాలి. గత 75 సంవత్సరాల కాలాన్ని నిశితంగా సమీక్షించినట్లయితే, నెహ్రూ తర్వాత మనదేశం 14 మంది ప్రధానమంత్రులను చూసినా, నిజంగా సంతృప్తిని కలిగించే దశ ఒక్కటైనా లేదు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా గతంలో వచ్చిన పార్టీలు సోషలిస్ట్ భావజాల నేపథ్యం గలవి. ఫెడరల్ ఆకాంక్షలు గల ప్రాంతీయ పార్టీలు, సామాజిక – ఆర్థిక వెనుకబాటుతనం పట్ల నిరసనతో ఏర్పడినవి కూడా ఉన్నాయి. వ్యవసాయం వంటి ప్రధానవృత్తి పునాదులు గలవి అయినందున వీటిని వామపక్షపు మొగ్గుగల మధ్యేమార్గ పార్టీలు అనటంలో సందేహం లేదు. ఆ నాయకులంతా అనుభవజ్ఞులే కూడా.
కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గతంలో జరిగిన ప్రయోగం విఫలమైంది. అయితే, జాతీయ స్థాయిలో విఫలమైంది గాని పలు రాష్ర్టాల పరిధిలో ఇంకా బలంగా ఉందన్నది మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయం. వాటన్నింటి బలం కలిపి కాంగ్రెస్ బలానికి మించి ఉందన్నది మరొక కీలకమైన అంశం.
అందుకే మనమిట్లా అవకాశాలనూ, వనరులనూ ఉపయోగించుకోలేక, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి, నిత్యసాంఘిక అశాంతితో కలవరపడుతూ, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. ఈ ప్రశ్నలకు సమాధానం కాగల మార్గం కేసీఆర్ జాతీయ మేనిఫెస్టోలో లభించగలదని ఆశించాలి. నెహ్రూ (1947-64) తర్వాత కాంగ్రెస్ నుంచి వేర్వేరు దశలలో శాస్త్రి, ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్లు ప్రధానులయ్యారు. ఎవరికి వారు ఏదో ఒక మంచి ఎంతో కొంత చేసినా, పైన పేర్కొన్న నాలుగు లక్ష్యాల కోణం నుంచి చేయనిది అంతకన్న చాలా ఎక్కువ ఉంది. చేసిన నష్టాలు కూడా తక్కువకాదు.
అందువల్లనే ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ల పాలనల మధ్యలోనో, చివరలోనో కాంగ్రెస్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కేంద్రంలో, అనేక రాష్ర్టాలలో అధికారాన్ని కోల్పోయింది. తన వెనుకటి స్థానాన్ని ఆ పార్టీకి దేశ ప్రజలు తిరిగి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇవ్వగల అవకాశం కనుచూపు మేరలో లేదు కూడా. దీనంతటికి మూలకారణం తామే ప్రకటించిన మేనిఫెస్టోలను, పైన పేర్కొన్న లక్ష్యాలకు వారు కట్టుబడకపోవడం. పైకి చెప్పేది ఒకటికాగా అంతర్గతంగా చేసేది, తమ విధానాల పొలిటికల్ ఎకానమీ, కీలకమైన విషయాలలో అందుకు భిన్నంగా ఉండటం, చాపకింద నీరువలె దేశానికి నష్టం చేయటం. ఇక వివిధ అవలక్షణాలు, పతనాల జాబితా అందరికీ తెలిసిందే అయినందున ఇక్కడ మళ్లీ రాయనక్కరలేదు.
నెహ్రూ అనంతరం వీరందరి విధానాలు, పరిపాలనలు పైన ప్రస్తావించిన లక్ష్యాలకు అనుగుణంగా లేనందువల్లనే ఆ ఉమ్మడి వైఫల్యాల ఫలితంగా, ప్రజల తీవ్రమైన అసంతృప్తితో, కాంగ్రెస్ క్రమంగా క్షీణిస్తూ నేటి దీనావస్థకు చేరింది.
మనదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ నేపథ్యం దృష్ట్యా, స్వాతంత్రోద్యమ ప్రభావాలను కూడా కలుపుకొని, కాంగ్రెస్పార్టీ వామపక్షపు మొగ్గుగల మధ్యే మార్గ సంస్థగా రూపు తీసుకుంది. ఆ దృక్పథం నిజానికి అన్ని వర్ధమానదేశాలు లేదా మాజీ వలస సమాజాల డీఎన్ఏ లోనే ఉంది. పాలకులు విఫలమైనా ఆ డీఎన్ఏ మాత్రం ప్రజలలో మారలేదు. కనుక, కాంగ్రెస్ విఫలమైన స్థితిలో, తాముకూడా వామపక్షపు మొగ్గుగల మధ్యేమార్గవాదులమంటూ పలు పార్టీలు ముందుకువచ్చి కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయజూశాయి. జనతాపార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అని పేర్లు పెట్టుకున్నాయి.
వారంతా కాంగ్రెస్ వైఫల్యాలనైతే విమర్శించారు గాని, వాటినుంచి నేర్చుకున్నది అతితక్కువ. మరొకస్థాయిలో వారి పొలిటికల్ ఎకానమీ కాంగ్రెస్ దానిని పోలినట్లు తయారైంది. వీటి కామన్ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ)లను పరిశీలించినపుడు కొన్ని మంచి తేడాలైతే కనిపిస్తాయి గాని, అవి ఆచరణకు వచ్చింది స్వల్పం. తర్వాతి యూపీఏ సహ వీటి మేనిఫెస్టోలలో ఎక్కడా కేసీఆర్ పేర్కొనే విధంగా వనరుల వినియోగం, సమగ్రాభివృద్ధి, దేశాన్ని అగ్రస్థాయికి తీసుకెళ్లటం, అన్ని వర్గాల అభివృద్ధి తరహా అంశాలు కనిపించవు. ఈ పార్టీల ప్రధానులు మొరార్జీ, చరణ్సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్. ఈ ఆరుగురు కలిపి పాలించింది ఏడు ఏండ్లు కూడా లేనందున ఎక్కువగా చేయలేకపోయారని ఏవరైనా సంజాయిషీ ఇవ్వవచ్చు. కానీ తమ తమ సీఎంపీల్లో ప్రజలకు ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీ రాజకీయ సుస్థిరత, అది నిలబెట్టుకోలేకపోవటం, సీఎంపీ కార్యక్రమాలను అమలు చేయలేకపోవటం రెండూ కూడా వారు కాంగ్రెస్ వైఫల్యాలనుంచి ఏమీ నేర్చుకోలేదని చెప్తున్నాయి. మరొక విధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ వైఫల్యాల వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయటంలో, ఈ దేశపు అవసరాలను, ఆశలను తీర్చటంలో వీరు కూడా విఫలమయ్యారు.
మొత్తానికి, వామపక్ష మొగ్గుగల రెండు వేదికలు విఫలమైన శూన్యంలోకి ఒక మితవాద పార్టీ బీజేపీ ప్రవేశించింది. ఈ పార్టీకి పరిస్థితుల కారణంగా ఈ దశలో అవకాశమైతే లభించింది గాని, దాని అజెండాలోని లక్ష్యాలు పైన మొదటి పేరాలో పేర్కొన్న రాజ్యాంగ లక్ష్యాలకు, ఇతర అంశాలకు అనుగుణమైనవి కావు. వారి ఆర్థిక, సామాజిక , రాజకీయ విధానాలు ఆ లక్ష్యాలకు భంగకరమైనవి. వారు ఈ దేశపు వనరులన్నీ బాహాటంగా తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు అమ్ముతారు. వివక్షలతో సమాజాన్ని అల్లకల్లోలం చేస్తారు. పేదలను అధోగతిలో వదులుతారు. చివరకు రాజ్యాంగాన్నే భ్రష్టు పట్టించి కొత్తది రాసుకుంటారు.
ఇటువంటి మహాక్లిష్టమైన చారిత్రక దశలో ఈ దేశానికి ఒక కొత్త ఆశ అవసరం. అది కొత్త ప్రయోగం అవుతుంది. అది దేశాన్ని రాజ్యాంగ లక్ష్యాలకు నిబద్ధం చేయాలి. సుస్థిర, సుదీర్ఘపాలన ఏర్పడగల దిశలో రాజకీయ నిర్మాణాన్ని ఒక క్రమ పద్ధతిలో సాగించాలి. వనరుల సక్ర మ వినియోగం ద్వారా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సామరస్యం, నవీనమైన ఆలోచనలు అనేవి ఆ నిర్మాణానికి నాలుగు స్తంభాలు కావాలి. కాంగ్రెస్ వివిధ ఫ్రంట్లు విఫలమైన చోట, బీజేపీ ఈ దేశాన్ని, సమాజాన్ని వినాశ నం చేయగల ప్రమాదం మధ్య దేశ భవిష్యత్తు కోసం కొత్త అజెండాతో కేసీఆర్ ముందుకు రావటం ఒక తప్పనిసరి అవసరం. ఆ అజెండాయే తన బలమై, ఏకీభావంగల శక్తులను, ప్రజలను తన వెంట నడిపిస్తాయి.
-టంకశాల అశోక్