వీధులు లేని పట్టణం, కోశాగారం లేని రాజు, వ్యాపారం లేని వర్తకుడు, గురువు లేని జీవితం ఇవన్నీ ఒకే లాంటివి. గురువు ప్రాధాన్యం ఎంతటిదో ఈ వాక్యం తెలియజేస్తుంది. మనిషికి గురువు ఎందుకు అవసరం? జీవితం ఒక్కోసారి చాలా సంక్లిష్టంగా మారుతూ ఉంటుంది. ఆనందం, బాధ, సంతోషం, కష్టాలు, ఉదార స్వభావం, అసూయ, ఆసక్తి, వైరాగ్యం ఇలా భిన్నపార్శాల కలయికే జీవితం. ఈ విధమైన పరస్పర వ్యతిరేక విలువలు ముసురుకున్నప్పుడు, మన మనసు ఈ వైరుధ్యాలను సంబాళించుకోలేక కూలబడుతుంది. అలాంటి కష్ట సమయాల్లో దారి చూపేవారు కావాలి. ఆ మార్గదర్శే గురువు. అదే జ్ఞానం.
మనిషికి ఏ కష్టాలు, ఎలాంటి క్లిష్టపరిస్థితులు లేనప్పుడు ఎవరి అవసరమూ రాకపోవచ్చు. పైగా కష్టాల్లో ఉన్నవారికి ఉచిత సలహాలు చెప్తుంటారు. కానీ, అవే కష్టాలు అతనికి ఏర్పడితే, అంతకుముందు ఎదుటివారికి ఇచ్చిన సలహాలు తనకు ఏ మాత్రం ఉపయోగపడకపోవచ్చు.
ఆ కష్టాలకు దూరంగా ఉండటం జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. కష్టాలపాలు కాకుండా కాపాడేదీ ఆ జ్ఞానమే! మనపై ముప్పేట దాడిచేసే సంక్లిష్ట వలయాలను ఛేదిస్తుంది. వ్యక్తిని స్థిరంగా, సురక్షితంగా ఉంచుతుంది. తీవ్రమైన కోరిక కలవరపెడుతున్న సమయంలో మనసుకు ప్రశాంతత కలిగించేదే జ్ఞానం. మనం చేయాల్సిందల్లా.. మన బాధలను, కోరికలను జ్ఞానమై మనలో వెలుగుతున్న గురువుకు సమర్పించుకోవడమే!
గురువును ఆశ్రయించడం అంటే మనలోని జ్ఞానాన్ని ప్రజ్వరింపజేయడమే. జ్ఞానం వికసించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది.
ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయగలుగుతాం. భయం లేకుండా లక్ష్యం వైపు ప్రయాణిస్తాం. జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి. మనలోని జ్ఞానమే మనకు గురువు. ప్రతి వ్యక్తిలో ఉండే ఒక గుణం, భావం ఇది. ఇది ఒక శరీరానికో, రూపానికో పరిమితమైనది కాదు. మనం వద్దనుకున్నా, గొడవపెట్టినా జ్ఞాన రూపంలో ఉన్న గురుతత్వం మన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. మానసికస్థితి, అర్థం చేసుకునే స్థాయులను బట్టి ప్రతి మనిషిలోనూ ఈ గురుతత్వం ఉంటుంది. నిద్రాణమై ఉన్న జ్ఞానమనే గురుతత్వాన్ని వెలికితీసి ప్రదీప్తం చేయాలి. మనకంటూ ఏ కోరికలూ లేనప్పుడు, విశాల దృక్పథం కలిగి ఉన్నప్పుడు మనలోని గురుతత్వం మేల్కొంటుంది. ఆ తత్వం మేల్కొన్నప్పుడు జీవితంలో కష్టాలు అంతరించిపోతాయి. మనలోని చైతన్యానికి జ్ఞానం తోడవుతుంది. ప్రతి క్షణం ఉన్నతంగా మారుతుంది. చేసే ప్రతి పనీ విలువలతో కూడి ఉంటుంది.
ఈ క్రమంలో ఎవరికి వారు, వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధిని సాధించారో మదింపు చేసుకునేరోజు గురుపౌర్ణమి. అలా చేయటం వల్ల వ్యక్తిగత ప్రోత్సాహం లభిస్తుంది. గత కొన్నేండ్ల నుంచి అనుకున్నంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదనిపిస్తే, మనలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోలేదని అర్థం. ఎక్కడో చిక్కుకుపోయారని అనిపిస్తే, ఆ చిక్కుకుపోయిన విషయాన్ని గ్రహించడం కూడా అభివృద్ధే! అదే గురుతత్వం!
జీవితంలో ఇప్పటివరకు ఎంత జ్ఞానం లభించిందో, ఆ జ్ఞానంలో మనం ఏ విధంగా ఎదుగుతున్నామో తెలుసుకునే పర్వదినం గురుపౌర్ణమి.
ఆ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి. అది మనలో వినయాన్ని పెంచుతుంది. గురుపౌర్ణమి సందర్భంగా మనలో ఈ స్థాయి ఆలోచన చేసే శక్తి కలిగించిన గురువుల పట్ల కృతజ్ఞత చాటుకోవాలి. నేటివరకు లభించిన అందరు గురువులను స్మరించుకోవాలి. మన జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దినవారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేయాలి. అప్పుడు గురువుతోపాటు జీవితంలో మనకు లభించిన ప్రతిదానినీ ఆరాధించగలుగుతాం. గురుపూజోత్సవం అంటే భక్తిలో, కృతజ్ఞతలో ఎదిగే సమయం. ఈ ప్రత్యేక సందర్భాన్ని సద్వినియోగం చేసుకుందాం.
-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
(నేడు గురుపౌర్ణమి)