తన ప్రాంతం… తన సమూహం… తన వాళ్ల కోసం ఎటువంటి భేషజాల్లేకుండా ఉద్యమించడం దబ్బేటి మహేష్కు బాల్యం నుంచే అలవడింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు ధైర్యంగా పోరాడే రాజకీయ తత్వ పరిశోధకుడు, అధ్యాపకుడు మహేష్. ఆయన మరణంతో విద్యార్థులు దుఃఖిస్తున్నారు. ఆయనను బతికించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ చేసిన అన్ని ప్రయత్నాలను తెలంగాణ సమాజం వేనోళ్ల కొనియాడుతున్నది.
కురివి వీరభద్రస్వామి సన్నిధిలో 1981లో జన్మించిన మహేష్ ఏటూరు నాగారం సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం చేశారు. అప్పట్నుంచే మహేష్ విద్యార్థి నాయకుడు. తన జీవనంలో పోరాటాన్ని ఒక భాగంగా ఎంచుకున్నాడు. మానుకోట కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో అక్కడి సౌకర్యాలు, నాణ్యమైన విద్య కోసం ఉద్యమించాడు. అప్పటి ఉద్యమ నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేయూ వేదికగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు దబ్బేటి మహేష్.
రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిపే రాస్తారోకో, ధర్నాలు, రైలురోకో, నిరాహారదీక్ష… ఇలా ఏ నిరసన కార్యక్రమమైనా మహేష్ ముం దుండి పాల్గొనేవాడు. ఎన్నడూ పోలీసుల లాఠీదెబ్బలకు బెదరలేదు. ఈ మానుకోట మాణిక్యం ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూనే ఉండేవాడు. ‘పొలికేక’ సభ అయినా, ఓయూలో జరిగిన ‘తెలంగాణ విద్యార్థి గర్జన’ అయినా అప్పటి ఆంధ్రా ప్రభుత్వాలు విఫలం చేయడానికి చేసే కుట్రల్ని తిప్పికొట్టడంలో మహేష్ పాత్ర ఉండేది. ఒకవైపు చదవడం, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం, మరోవైపు పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. చిన్నవయస్సులోనే మహేష్ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యం పాలయ్యాడు. ఆ అనారోగ్యంతోనే పీహెచ్డీ పూర్తిచేశాడు. కేయూలో పార్ట్టైం అధ్యాపకుడిగా జీవనం సాగిస్తున్న క్రమంలో రాష్ట్రం ఆవిర్భవించింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో, యూనివర్సిటీ ఉన్నత విద్యను ఉన్నతీకరించడం కోసం, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న మహేష్ లాంటి అధ్యాపకులకు దేశంలో ఏ రాష్ట్రం లోనూ పెంచనివిధంగా జీతాలు పెంచి వారి జీవన ప్రమాణం పెంచడానికి కృషిచేశారు. ఈ నేపథ్యంలోనే పార్ట్టైం అధ్యాపకులకు జీతాలు పెరిగాయి, అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతున్న సమయంలో కరోనా బారిన పడ్డాడు మహేష్.
మహేష్కు కేటీఆర్ అండ: పేద, దళిత కుటుంబంలో పుట్టిన మహేష్కు కరోనా సోకిన విషయం ఆలస్యంగా తెలిసింది. మహబూబాబాద్ దవాఖానలో ప్రాథమికంగా షరీఖ్ అయ్యాడు. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయి. తెలంగాణ ఉద్యమకారుడైన మహేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అతనికి ఎంజీఎం దవాఖానలో మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని వైద్యులకు చెప్పారు. మంత్రి కేటీఆర్ ‘మీకు నేనున్నాను, మహేష్ను బతికించుకుందాం’ అంటూ తరచూ ఫోన్లో మాట్లాడుతూ మహేష్ కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. మహేష్ ‘కరోనా’ వ్యాధిని మొదట్లో గుర్తించకపోవడం వల్ల 45 రోజులు దవాఖానలో చికిత్స పొందుతూ చివరికి డిసెంబర్ 23న మనల్నందరినీ విడిచివెళ్లిపోయారు. ఈ వార్త తెలుసుకున్న కేటీఆర్ మహేష్ ఉద్యమస్ఫూర్తిని కొనియాడుతూ వారి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. వారి కుటుంబం గౌరవప్రదంగా బతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని, వారి పిల్లల చదువు కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ఉద్యమకారులను, వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయం అందించడానికి కృషి చేస్తుందని, అందుకు నాది బాధ్యత’ అని కేటీఆర్ మాటివ్వడం ఆయన దార్శనికతకు, గొప్ప మనస్సుకు నిదర్శనం. ఈ సందర్భంగా కేటీఆర్లో ఉన్న మానవ తను యావత్ విద్యార్థి మేధో సమాజం ప్రశంసిస్తున్నది.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, కేయూ)
(నేడు దబ్బేటి మహేష్ పెద్దకర్మ)
డాక్టర్ బైరి నిరంజన్
93901 15644