న్యూఢిల్లీ, ఆగస్టు 5: క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ వజీర్ఎక్స్కు చెందిన రూ.64.67 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను బుధవారం జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. వజీర్ఎక్స్పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ డిపాజిట్లను ఫ్రీజ్ చేసింది. ఈ నెల 3న హైదరాబాద్లో వజీర్ఎక్స్ యాజమాన్య సంస్థ జన్మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన డైరెక్టర్ సమీర్ మాత్రే డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలియజేసింది. సదరు డైరెక్టర్ తమ దర్యాప్తునకు సహకరించటం లేదని కూడా చెప్పింది. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న అనేక చైనా ఆధారిత లోన్ యాప్స్పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ యాప్స్తో వజీర్ఎక్స్కున్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించింది. గత ఏడాది వజీర్ఎక్స్.. విదేశీ మారకం నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లఘించిందని ఈడీ ఆరోపించినది తెలిసిందే.
కాగా, పలు భారతీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వాటి ఫిన్టెక్ భాగస్వాములపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్నది. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమ రుణ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్న అభియోగాలున్నాయి. ముఖ్యంగా టెలీ-కాలర్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, రుణగ్రహీతలను దుర్భాషలాడటం, అధిక వడ్డీరేట్లు వసూలు చేయడం వంటివి చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగగా.. ఫిన్టెక్ సంస్థలు క్రిప్టో ఆస్తులను కొనడానికి, విదేశాలకు నిధులను తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇందులో పెద్ద మొత్తం వజీర్ఎక్స్కు మళ్లినట్టు తేలింది. కొనుగోలు చేసిన క్రిప్టో ఆస్తుల్ని విదేశీ వ్యాలెట్లలోకి పంపినట్టూ స్పష్టమైంది. క్రౌడ్ఫైర్, కేమ్యాన్ ఐస్లాండ్కు చెందిన బైనాన్స్, సింగపూర్ ఆధారిత జెట్టాయ్ తదితర సంస్థలతో వజీర్ఎక్స్ అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఈడీ తెలియజేసింది.