చంఢీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేపడుతున్న విషయం తెలిసిందే. శాండ్ మైనింగ్ కేసులో నిన్నటి నుంచి ఆ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఈడీ అధికారులు భూపిందర్ ఇంటి నుంచి సుమారు 3.9 కోట్ల నగదును రికవరీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ అధికారులు మొత్తం 10 కోట్ల నగదును రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో సీఎం చన్నీ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు చేయడం గమనార్హం.
భూపిందర్ సింగ్ అలియాస్ హనీకి సంబంధం ఉన్న పలు ప్రదేశాల్లో నిన్న ఈడీ సోదాలు చేపట్టింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బుతో పాటు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈడీ సీజ్ చేసింది. సుమారు 8 కోట్ల నగదును భూపిందర్తో లింకున్న ప్రాంతాల నుంచి సేకరించారు. సందీప్ కుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి మరో రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో విచారణ నిమిత్తం త్వరలో ఈడీ కొందరికి సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. చండీఘడ్, మొహాలీ, లుథియానా, పఠాన్కోట్లో ప్రస్తుతం తనిఖీలు జరిగాయి. బెంగాల్ ఎన్నికల సమయంలోనూ దీదీ ఆఫీసులో ఈడీ సోదాలు జరిగాయని, ఇప్పుడు కూడా ఎన్నికలు ఉన్నాయని తనిఖీలు చేపడుతున్నారని, ఎటువంటి వత్తిడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం చన్నీ తెలిపారు.