కోల్కతా, జూలై 23: టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత పార్థ చటర్జీని ఈడీ శనివారం అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నది. శుక్రవారం జరిగిన దాడుల్లో ఆమె నివాసంలో ఈడీ అధికారులు రూ.21 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు మంత్రి పార్థఛటర్జీకి సంబంధం ఉన్నదని ఈడీ చెబుతున్నది. పార్థఛటర్జీ, మరో మంత్రి పరేశ్తో పాటు 10 మందికి పైగా ఇతరుల నివాసాలపై ఈడీ శుక్రవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. కోల్కతాలోని పార్థచటర్జీ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఛటర్జీ నివాసంలో శుక్రవారం ఉదయం సోదాలు ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 23 గంటలపాటు ఆయన్ను ప్రశ్నించారు. విచారణకు పార్థఛటర్జీ సహకరించలేదని, దాంతో అరెస్టు చేశామని ఈడీ శనివారం వెల్లడించింది. పార్థచటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం మమత క్యాబినెట్లో వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
అరెస్టు అనంతరం పార్థచటర్జీని కోర్టులో హాజరుపరుచగా ఈడీ కస్టడీకి అప్పగించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా దవాఖానాలో చికిత్స తీసుకునేందుకు అనుమతినిచ్చింది. సోమవారం కోర్టుకు తిరిగి హాజరుపరుచాలని ఈడీకి సూచించింది. అరెస్టుల నేపథ్యంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్కతాలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు.
ఈడీ దాడుల నేపథ్యంలో ‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ అంటూ బీజేపీ నేత సువేందు అధికారి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం మమతతో అర్పిత ముఖర్జీ వేదిక పంచుకున్న ఫొటోలను షేర్ చేశారు.