న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఎన్నికల్లో ఉచిత హామీల అంశంపై చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలపై కీలక ప్రతిపాదనలు చేస్తూ మంగళవారం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. ఎన్నికల హామీలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు వాటిని ఎలా నెరవేరుస్తారు? అందుకు గల ఆర్థిక వనరుల విషయంపై ఓటర్లకు తగిన ప్రామాణికమైన సమాచారం ఇచ్చేలా కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై ఈనెల 19లోగా అభిప్రాయాలు తెలుపాలని అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలను కోరింది. అప్పటికీ ఏ పార్టీ నుంచి అయినా స్పందన రాకుంటే.. ఆ పార్టీ సంబంధిత అంశంపై చెప్పాల్సింది ఏమీ లేదని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఊరికే ఇచ్చే ఎన్నికల హామీలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసిన ఈసీ.. ఎన్నికల హామీల అమలు తీరును చెప్పకపోవడం పర్యావసానంగా ఆర్థిక స్థిరత్వంపై పడే అవాంఛనీయ ప్రభావాన్ని విస్మరించలేమని పేర్కొన్నది.
ఎన్నికల నియమావళిలో సవరణతో పార్ట్-8(ఎన్నికల మ్యానిఫెస్టోపై మార్గదర్శకాలు)కు ఓ ప్రొఫార్మా(నమూనా పత్రాన్ని) జత చేర్చడంపై ఈసీ తాజా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలను, అదేవిధంగా సంబంధిత హామీలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు తగినట్టుగా ఉన్నాయా? లేదా? అనేది ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు వివరాలు, వ్యయ హేతుబద్దీకరణ వంటివి ఏమైనా ఉంటే.. వాటితో పాటు అప్పులపై ప్రభావం, తద్వారా ఎఫ్ఆర్బీఎం పరిమితులపై ప్రభావం వంటి అంశాలపై కూడా వివరాలు చెప్పాలి. హామీలు, వాటిని ఎలా నెరవేరుస్తామనే ఆర్థిక అంశాలపై ఇచ్చే తగిన సమాచారం ఆధారంగానే ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉంటుందని ఈసీ లేఖలో అభిప్రాయపడింది.