హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభలకు పోటీ చేయకుండా సీఈసీ నిర్ణయం వెలువరించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్ సమర్పించలేదు. పోటీ చేసిన అభ్యర్థి ఫలితం ప్రకటించిన నెలలోపు ఎన్నికల ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాలి. ఈ విషయంలో విఫలమవడంతో బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
బలరాం నాయక్పై వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలికి మూడేళ్ల పాటు(జూన్ 2024 వరకు) పోటీ చేయరాదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదేవిధంగా ఏప్రిల్ 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బలరాం నాయక్ పోటీ చేసేందుకు వీలులేకుండా పోయింది. గతంలో కాంగ్రెస్ తరపున 2009లో ఎంపీగా బలరాం నాయక్ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్లో ఆయన మంత్రిగా పని చేశారు.