రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు సీఈవోను కలిశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మంది పేర్లతో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని, ఎన్ని ఖాతాలు ఓపెన్ చేశారనే దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈటల అక్రమాలపై ఇప్పటికే అనేకమార్లు ఫిర్యాదు చేశామని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లోనూ బీజేపీ ఇలాంటి పని చేసిందని, ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అదే పని చేస్తున్నదని ఆరోపించారు. డూప్లికేట్ సిమ్కార్డ్లు తెచ్చి వారి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. అలాగే బ్యాంక్ ఖాతాలపైనా నిఘా పెట్టాలని విజ్ఞప్తిచేసినట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ గెలుస్తున్నదనే భయంతో బీజేపీ ఈ కుట్రలకు దారి తీస్తోందన్నారు. ఈటల, బీజేపీ పార్టీ ఈ మధ్య కొత్త టెక్నాలజీని వాడుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీ పీహెచ్డీ చేసిందని టీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు.