మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 17: ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో(చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. ఈస్టర్ను పురస్కరించుకుని మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
సిలువ ఊరేగింపుతో ప్రారంభమైన వేడుకలు..
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4.30 గంటలకు సిలువ ఊరేగింపుతో ఈస్టర్ వేడుకలు చర్చి బయట ప్రాంగణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈస్టర్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సిలువకు మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువుల భక్తి సూక్తుల మధ్య భక్తి గీతాలు ఆలపించారు. యేసు సమాధి నుంచి లేచి వచ్చిన సందేశాలతో భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కొంతమంది క్రైస్తవులు తమ ఆప్తుల సమాధుల వద్ద ఆదివారం తెల్లవారు జామున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.
మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు
– ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్
మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు. యుగయుగాలకు యేసయ్య సజీవుడై ఉంటాడని మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్ అన్నారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు సందేశం చేశారు. క్రీస్తు సమాధిలో నుంచి లేచి వచ్చిన శుభవేళనే ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నమన్నారు. అంతకుముందు చర్చి పాస్టర్లు సందేశం చేశారు. వేడుకల్లో చర్చి పాస్టర్లు, రాజశేఖర్, దయానంద్, జైపాల్, రిచర్డ్స్ చర్చి కమిటీ సభ్యులు శాంతికుమార్, రోలాండ్పాల్, సునీల్, గెలెన్, సాలోమాన్, ఉదయ్ కిరణ్, సువన్ డగ్లస్, శాంసన్ సందీప్, సుశీల్ కుమార్, వసతి గృహాల మేనేజర్ జాయ్ ముర్రే తదితరులు పాల్గొన్నారు.