గువాహటి: అసోంలో గత వారం రోజులుగా క్రమం తప్పకుండా భూ ప్రకంపణలు సంభవిస్తున్నాయి. గత గురువారం రాష్ట్రంలోని తేజ్పూర్లో 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఇవాళ ఉదయం 7.5 గంటలకు నగౌన్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.0గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని వెల్లడించింది. కాగా, కొన్నిరోజుల క్రితం 24 గంటల వ్యవధిలో పదిసార్లు భూమి కంపించింది.
ఈ నెల 5న (బుధవారం) సాయంత్రం 7.22 గంటలకు సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్రతత భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మే 1న (శనివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్పూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.3 గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి