ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
చండూరు, అక్టోబర్ 19: టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని శిర్దేపల్లి, తాస్కానిగూడెంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, యువతతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
శిర్దేపల్లి గ్రామానికి చెందిన బొల్లం శ్రీను, సూర్యకళ దంపతుల కుమారుడు ఫ్లోరైడ్ కారణంగా మంచానికే పరిమితం కాగా మంత్రి సదరు బాలుడితో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన మరో దివ్యాంగుడితో మాట్లాడి.. పింఛన్ వస్తుందా? అని ఆరా తీశారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో మాజీ సర్పంచ్ దామెర యాదయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.