సీతారామ ప్రాజెక్టుకు కూడా..
అనుమతులివ్వాలని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు సిఫారసు
ఫలించిన తెలంగాణ సర్కారు కృషి
తెలంగాణ వాదనలతో ఏకీభవించిన ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రతో సంబంధం లేకుండా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు చేస్తున్న అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ వాదనలతో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) ఏకీభవించింది. మహారాష్ట్రతో సంబంధం లేకుండా తెలంగాణ చేపట్టిన చనాక కొరాట ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 2016లో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం అనంతరం తెలంగాణ సర్కారు ఈ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులను ఉమ్మడిగా తీసుకోవాలని కేంద్రం గతంలో సూచించింది. ఒకవైపు ఒప్పందంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తిచేయడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం బరాజ్ నిర్మాణం సైతం ఇప్పటికే పూర్తిచేసింది. కాగా, మహారాష్ట్ర సర్కారు తన పోర్షన్కు సంబంధించిన పనులకు కనీసం పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేయలేదు. అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులను కూడా తీసుకోవడంలేదు. దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడం తీవ్ర జాప్యమవుతున్నది.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80% పనులకు పర్యావరణ అనుమతులు మంజూరుచేయాలని తెలంగాణ సర్కారు ఎప్పటినుంచో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నది. గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ర్టాలు చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని ఈఏసీకి వివరించింది. లోయర్ పెన్గంగ ప్రాజెక్టుకు అదేవిధంగా అనుమతులను మంజూరుచేశారని కూడా ఉదహరించింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రతో సంబంధం లేకుండా ప్రాజెక్టులో తెలంగాణకు సంబంధించిన పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ వాదనలతో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ సభ్యులు యోగేంద్రపాల్, సౌరభ్ ఉపాధ్యాయ ఏకీభవించారు. చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది.
ఫలించిన తెలంగాణ సర్కారు కృషి..
గోదావరి సబ్బేసిన్ జీ7 లో పెన్గంగ నదిపై మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఘటాంజీ తాలుకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దాని కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర నీటిని వినియోగించుకోవాలి. మొత్తంగా 89 కిలోమీటర్ల పొడవు ఉంటే ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 47,520 ఎకరాలకు సాగు నీరివ్వాలి. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. డ్యామ్ నిర్మాణం పూర్తికావడం లేదు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పేరిట ఉమ్మడిపాలకులు ఓట్లు దండుకున్నారు తప్ప చేసిందేమీలేదు. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పెన్గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పెన్గంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. బరాజ్ నిర్మాణానికి రూ.368 కోట్లు, లోయర్పెన్గంగ పనులకు రూ.1,227 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరుచేశారు. ఉమ్మడి పాలకులు 4 దశాబ్దాలుగా పూర్తి చేయలేని కలను సీఎం కేసీఆర్ ఆరేండ్లలో సాకారంచేశారు. ఈ బరాజ్ ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ ప్రాజెక్టు పనులకు మహారాష్ట్ర ఎలాంటి అనుమతులను మంజూరు చేయకపోవడంతో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి మహారాష్ట్రతో సంబంధం లేకుండా తెలంగాణ చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు కోరుతున్నది. నాటినుంచి సీఎం కేసీఆర్ కేసీఆర్ మార్గదర్శకాల మేరకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చుట్టూ మూడేండ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈఏసీ లేవనెత్తిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ వస్తున్నారు.
సీతమ్మసాగర్ బరాజ్కూ..
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకం కాంపోనెంట్లో సీతమ్మసాగర్ను భాగంచేస్తూ సవరణ చేయాలని, తద్వారా పర్యావరణ అనుమతులను మంజూరుచేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేస్తున్నది. అందుకు సంబంధించి వాదనలను వినిపిస్తూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ఈఏసీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కచ్చితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) జారీ చేసింది. అటవీ భూముల బదలాయింపు, బయోడైవర్సిటీ ప్రభావం, వైల్డ్లైఫ్ శాంక్చురీపై ప్రాజెక్టు ప్రభావం తదితర అంశాలపై స్పష్టతనివ్వాలని సూచించింది. వాటిపై తెలంగాణ సమాధానాలు ఇచ్చిన అనంతరం పర్యావరణ అనుమతులు మంజూరయ్యే అవకాశముంటుంది.