హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయం సాధిస్తామని గొప్ప నమ్మకం ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు కుటుంబ పెద్దగా ముందుండి నడుపుతున్న కేసీఆర్కు భగవంతుడు మరింత శక్తిని ప్రసాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం దసరా పండుగ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదన్నారు. అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని, రైతు కేంద్రంగా అనేక పథకాలకు అమలవుతున్నాయని చెప్పారు. దేశమంతటా తెలంగాణ వంటి పాలన రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగులో తెలంగాణ ప్రజలంతా కలిసి నడవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను కోరుకున్నానని పేర్కొన్నారు. అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.