శ్రీశైలం : అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం దేవస్థానం ఈఓ లవన్న ఆలయానికి చెందిన అన్ని విభాగాలకు అధికారులు, ప్రధార్చకులు, వేదపండితులు, పర్యవేక్షకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, దర్శన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాలపై కూలంకషంగా చర్చించారు.
కరోనా నేపథ్యంలో దసరా మహోత్సవాలను గతేడాది మాదిరిగానే గ్రామోత్సవాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఆలయంలోనే నిర్వహించాలని, భక్తులకు వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, పరిసరాలు, ఆలయ ప్రాకారం, మాడవీధులు శోభాయమానంగా ఉండేలా విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. అలాగే సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేపట్టాలని చెప్పారు. నిత్యం నిత్య కల్యాణవేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ మల్లికార్జున స్వామి విశేష అర్చనలు, భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం, ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, వివిధ వాహనసేవలు నిర్వహించాలని ఆదేశించారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 7న ఉదయం 8.30 గంటలకు అమ్మవారు యాగశాల ప్రవేశం చేయడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదట వేదస్వస్తి, ఉత్సవ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, దీక్షాసంకల్పం, రుత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, చండీ కలశ స్థాపన జరుగనున్నాయి. అదే రోజు ఉదయం 10.45గంలకు స్వామివారి యాగశాలలో ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణలు, శివసంకల్పం, గణపతి పూజ అఖండదీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవి కలశస్థాపన పూజలు జరుగనున్నాయి.
ఉత్సవాల్లో నిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రపారాయణం, అమ్మవారికి శ్రీచక్ర అర్చన, విశేష కుంకుమార్చన, సువాసినీపూజ, కాళరాత్రి పూజలు జరుగనున్నాయి. దసరా, మహర్నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. 15న విజయదశమి సందర్భంగా శమీపూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆర్జితసేవలలో ప్రతి రోజు ప్రతీరోజు స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, లక్షకుంకుమార్చన, నవావరణపూజలు నిలిపి వేశారు.
తేదీ — అలంకరణ — వాహనసేవ
07న — శైలపుత్రి — భృంగి వాహనం
08న — బ్రహ్మచారిని — మయూర వాహనం
09 — చంద్రఘంట — రావణవాహనం
10న — కూష్మాండ దుర్గ — కైలాసవాహనం
11న — స్కందమాత — శేష వాహనం
12న — కాత్యాయని — హంసవాహనం
13న — కాళరాత్రి — గజవాహనం
14న — మహాగౌరి — నంది వాహనం
15న ఉదయం — సిద్ధిదాయిని — అశ్వవాహనం
15న సాయంత్రం — భ్రమరాంబదేవి — ఆలయ ఉత్సవం