Dussehra | లోకాలను పాలించే చల్లనితల్లి జగన్మాత చేసిన రాక్షససంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. విజయదశమి కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రం ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఇక విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, విజయదశమి ( Vijaya dashami ) రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు.
మానవుడిలో స్ఫూర్తిని రగిలించి, వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్యదీక్షను తట్టిలేపి, విజయతీరానికి నడిపించడమే విజయదశమి పండుగ పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గ, కాళి, లలిత, మహిషాసురమర్దిని… ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనీషిగా, పోరాటయోధుడిగా, కర్తవ్యదీక్షాపరుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు. అదొక అనంత విజయాల దశమి.
విద్య మనిషిని మనీషిగా చేస్తుంది. మంచి, చెడుల విచక్షణ జ్ఞానాన్ని అందిస్తుంది. అన్ని విద్యలూ సరస్వతీ స్వరూపాలే. పుట్టుకతో మాత్రమే మనిషిగా ఉన్న వ్యక్తికి విద్యద్వారా పునర్జన్మ ఇచ్చే తల్లి భారతి. ఈమె విద్యాధిదేవత, వేదమాత, జ్ఞానదాత్రి. అజ్ఞానం వల్ల ఏర్పడే చీకటిని, సత్యమైన జ్ఞాన ప్రకాశం వల్ల తొలగించేలాగా ఈ తల్లి వరమిస్తుంది.
నవరాత్రి ఉత్సవాలు శరత్కాలంలో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులు అయ్యాయి. శరత్కాలానికి మన వాఙ్మయంలో విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మకు శారద అనే నామం ఉంది. ‘శరదిదిభవా శారదా..’ శరత్కాలంలో ఉద్భవించిన తల్లి శారద అయ్యింది. ఈ శారద జ్ఞానప్రదాయిని. ప్రకృతిని పరిశీలిస్తే శరత్కాలం రాగానే నదుల్లోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. తద్వారా నదీజలాలు సేవించడానికి అనువుగా మారతాయి. అలాగే, శక్తి ఉపాసన ద్వారా మనసులోని మాలిన్యాలు తొలగి జ్ఞానోదయం కావడమే శరన్నవరాత్రుల పరమార్థం. మనకు కలిగే విజయం కూడా!
శత్రువులంటే బాహ్యంగా మనకు కనిపించి, మనతో శత్రుభావాన్ని ప్రకటించే వ్యక్తులు కొందరైతే, మనలోనే ఉంటూ మనకు దుర్బుద్ధి కలిగించి, మన కర్తవ్యాన్ని దారి మళ్లించే శత్రువులు కొన్ని ఉంటాయి. ఇవే అంతర్ శత్రువులు. జగదంబ ఆరాధన బాహ్య శత్రువులతో పాటు అంతర్ శత్రువుల బాధను తొలగిస్తుంది. దసరా నాడు చేసే అర్చనాది విధానాల్లో శమీ పూజ ఒకటి. శమీ పూజ పాపాలను నశింపజేసి, విజయాలను కటాక్షిస్తుంది. శమీ వృక్షాన్ని దర్శించి అర్జునుడు గాండీవాన్ని ధరించి విజయుడిగా కీర్తిపొందాడు. జానకితో జగదభిరాముడిని కలిపి లోకానికి మేలు కూర్చింది. అలాగే, అమ్మకు చేసే అర్చన, ఆరాధనల ఫలితంగా మనలోని దుర్గుణాలు నశిస్తాయి.
నవరాత్రులంటే తొమ్మిది ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్ఠితమై ఉండి, వాటిని కాపాడే ప్రాణదేవతే పదో ప్రాణం. ఆమే పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్య ప్రాణదేవత పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ప్రాణదేవత అవతారాలు. నవరాత్రి వ్రతం ద్వారా ప్రాణశక్తి స్వరూపంగా అమ్మను ఉపాసన చేసినట్లయితే మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యత్వం పొందుతుంది.
అమ్మను ఆరాధిస్తూ చేసే నవరాత్రి వ్రతం అనేక సిద్ధుల్ని కలిగిస్తుంది. సిద్ధులు అంటే మంత్రతంత్రాలనే భావన కాదు. మనోనిశ్చలత, లక్ష్యసాధన కూడా సిద్ధులే. కోరికలు తీరడమే సిద్ధత్వం. దేవీభాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేవి నవదుర్గా రూపాలు. వీటిల్లో సిద్ధిదాత్రి రూపంలో అమ్మను ఉపాసన చేస్తే అష్టసిద్ధులతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.
ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చనా విధానమే నవరాత్రి వ్రతం. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతమవుతుంది. ఇలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది, ఆధ్యాత్మికశక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తిమంతుడవుతాడు.
… ✍ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
బాసర ఒక్కటే కాదు.. తెలంగాణలో ఉన్న ఈ సరస్వతీ దేవాలయాల గురించి తెలుసా !!”
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?