అనంతపురం జిల్లా : టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. పంట కోసి తీసుకొచ్చినా.. సరైన ధర లేకపోవడంతో మార్కె్ట్లకు రవాణా చేయడం నిలిపి రోడ్లపైనే పారబోశారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాట 2 రూపాయలు పలుకుతున్నది. రాప్తాడు, శింగనమల, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో టమాట సాగు పెద్ద మొత్తంలో జరుగుతున్నది. పంట కోసే స్థితిలో లేకపోవడంతో చాలా మంది రైతులు తమ తోటల్లోకి పశువులను మేతకు అనుమతినిస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు, కల్యాణదుర్గం, కంబదూరు, పేరూరు, కనగానపల్లి మండలాలకు చెందిన రైతులు ఇవాల ఉదయం ఆటో ట్రాలీల్లో టమాట మార్కెట్కు చేరుకున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉసూరుమన్నారు. గిట్టుబాటు చెల్లించి పంట కొనాలంటూ హోల్సెల్ వ్యాపారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో చేసేదేం లేక మార్కెట్కు తీసుకొచ్చిన టన్నుల కొద్దీ పంటను హైవే పక్కనే పారబోశారు.
గత నెలలో క్వింటాల్ టమాటా రూ.1000కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.300 కూడా అందడం లేదు. కూలీ చెల్లింపులు అదనపు భారం అవుతుందన్న కారణంతో పలువురు రైతులు టమాటా పంట కోయడం మానేశారు. మార్కెట్లో భారీ స్థాయిలో టమాటా అందుబాటులో ఉండటంతో ధర తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం ద్వారా టమాట రైతులను ఆదుకునే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టమాట కెచప్, సాస్, చిప్స్, జ్యూస్, పల్ప్లను భద్రపరిచి భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు అనంతపురం జిల్లాలో కనీసం 4 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, 10 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.